నవాబుపేట, నవంబర్ 16 : పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్న మైతాబ్ఖాన్గూడ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. నెలనెలా వచ్చే ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకున్న ఈ నూతన పంచాయతీ రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మధ్యలో ఉండడం విశేషం. గ్రామ రోడ్లుకు ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చని తోరణాల్లా స్వాగతం పలుకుతున్నాయి.
నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. చిన్నారులు ఆడుకునేందుకు ఆటవస్తువులను సైతం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. తొలిసారిగా సర్పంచ్గా ఎన్నికైన అనీతారంగారెడ్డి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.
‘మిషన్ భగీరథ’ కింద ఇంటింటికీ నల్లాలను వేసి తాగునీటి సమస్య లేకుండా చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ మొక్కలను అందజేశారు. చివరి మజిలీ కోసం వైకుఠధామాన్ని నిర్మించారు. తక్కువ కాలంలోనే గ్రామం అభివృద్ధి చెందడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో మరింత గ్రామాభివృద్ధికి కృషి చేస్తా. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. పల్లె ప్రగతిలో భాగంగా పడావ్ ఇండ్లను కూల్చి వేశాం. ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన మంత్రి సబితారెడ్డి గ్రామ వాతావరణాన్ని చూసి ప్రశంసించారు.
– అనితారంగారెడ్డి, సర్పంచ్
నిత్యం పంచాయతీ సిబ్బందితో గ్రామ వీధులను శుభ్రం చేయిస్తున్నాం. ఎక్కడైనా కలుపు మొక్కలు ఉంటే వెంటనే తొలగిస్తున్నాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మించాం. సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో చర్చిస్తున్నాం.
– వరలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ