మొయినాబాద్, నవంబర్ 16 : ఆహ్లాదకరమైన వాతావరణం.. పచ్చని చెట్లు.. పక్షుల కిలకిల రాగాలు.. జింకల పరుగులు.. నెమలుల నాట్యాలు.. పాముల సయ్యాటలు.. ఉడుతల ఉరుకులు.. ఇవన్ని చూడాలంటే చిలుకూరు జాతీయ మృగవని పార్కుకు వెళ్లాల్సిందే. ఈ పార్కుకు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. అధికారులు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ జీవవైవిధ్యం, పర్యావరణం, వన్యప్రాణులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పార్కు 5 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండడంతో సందర్శకుల కోసం ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆనుకొని ఉండగా, ఈ వనానికి రెండు వైపులా గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాలు ఉన్నాయి. హైదరాబాద్ బీజాపూర్ అంతరాష్ట్ర రహదారి పక్కనే ఉండడం పార్కుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనెంబర్ 1లో సుమారు 1200 ఎకరాల భూమి రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండగా, ప్రస్తుతం వనం 900 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఈ ప్రాంతాన్ని 1998లో మృగవని జాతీయ వనంగా (చిలుకూరు మృగవని జాతీయ పార్కు) నామకరణం చేశారు. అంతకు ముందు తెలంగాణ ప్రాంత సస్లీ చట్టం-1965 ప్రకారం ఈ ప్రాంతాన్ని ‘రక్షిత అడవిగా’ గుర్తించారు. సందర్శకులను ఆకర్షించేలా పచ్చని బయళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మూజీయాన్ని సైతం ఏర్పాటు చేయగా, సందర్శకులు చిత్రాలను తిలకిస్తున్నారు.
సందర్భకులు, విద్యార్థుల కోసం ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పర్యావరణం, వన్యప్రాణులు వివిధ అంశాలపై బోధిస్తారు. ప్రొజెక్టర్ ద్వారా జీవరాశులు.. వన్యప్రాణులు.. ఔషధమొక్కలు, పాములు, మూఢ విశ్వాసాలపై అవగాహన కల్పిస్తారు. పార్కులో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఉన్నది. అందులో 40 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం ఉన్నది. ప్రతి ఏడాది అక్టోబర్ మొదటి వారంలో వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహించి విద్యార్థులకు, సందర్శకులకు అవగాహన కల్పిస్తారు.
సందర్శకుల కోసం అధికారులు మూడు సఫారీలను(బస్సులు) ఏర్పాటు చేశారు. పార్కులో తిప్పడానికి రూ.70లు తీసుకుంటారు. సపారిలో వెళ్లిన సందర్శకులు జింకల గంతులు, పక్షుల కిలకిలరాగాలు, పాముల సయ్యాటలు, నెమలుల నాట్యాలను తిలకిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. పార్కును సందర్శించేందుకు పెద్దవారికి రూ.40, చిన్న పిల్లలకు రూ.20 ప్రవేశ రుసుము ఉంటుంది.
భారతదేశం అటవీ సంపదకు పెట్టింది పేరని హైదరాబాద్ మహా నగరంలో 2012లో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సుమారు వందకుపైగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని మృగవని పార్కును సందర్శించారు. ఇక్కడ ఉన్న చెట్లు, ఔషధ మొక్కలు,వివిధ రకాల పక్షులు, జంతువులను చూసి అద్భుతమైన పార్క్ అంటూ కితాబునిచ్చారు.
మృగవని పార్కులో వివిధ రకాల పక్షుజాతులు, జంతువులు, వృక్షాలు, ఔషధమొక్కలు, జీవచరాలు ఉన్నాయి. 500 చుక్కల జింకలు, 70 దుప్పిలు, 200లకు పైగా నెమలులు, 100కు పైగా వివిధ రకాల పక్షులు, కొండచిలువలు,కోడెనాగులు, జెర్రిపోతులు, కట్లపాములు ఉన్నాయి. ఉడుములు, కుందేళ్లు, పునుగుపిల్లులు, అడవి పందులు ఉన్నాయి. 600లకు పైగా వివిధ రకాల చెట్లు ఉన్నాయి. జంతువులు నీళ్లు తాగడానికి అక్కడక్కడ నీటి తొట్టీలను ఏర్పాటు చేశారు. అందులో పెద్ద చెరువు కూడా ఉన్నది. ఔషధ మొక్కలకు వాటి పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు.
జాతీయ మృగవని పార్కులో వివిధ రకాల మొక్కలు, చెట్లు, పచ్చని బైళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి, అనంతగిరి అడవులకు వెళ్లే సందర్శకులు, జంట జలాశయాలకు వచ్చే పర్యాటకులు జింకల పార్కును సందర్శించి వెళ్తుంటారు. మొయినాబాద్లో అత్యధిక ఇంజినీరింగ్ కళాశాలలు ఉండడం వల్ల విద్యార్థులు పార్కులో గడుపుతారు. పచ్చని చెట్ల మధ్య, పక్షుల కిలకిలరాగాల ధ్వనుల మధ్య, జింకల పరుగుల మధ్య సందర్శకుల మనస్సును దోచేస్తుంది ఈ పార్కు. వారంతపు సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చి వనభోజనాలు చేసి ఆనందంగా గడిపి వెళ్తుంటారు. పార్కుకు దగ్గరలోనే గండిపేట(ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ జలాశయాలు ఉన్నాయి.
వన్యప్రాణులు, పర్యావరణపై శిక్షణ శిబిరాలు..
వనంలో వివిధ రకాల పక్షిజాతులు, జంతువులు, ఔషధ మొక్కలు, 6 వందల జాతులకు పైగా చెట్లు ఉన్నాయి. సందర్శకులను సఫారిరైడ్లో తీసుకెళ్లి చూపిస్తాం. వీడియోల ద్వారా పర్యావరణ, వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తాం. పాములపై ప్రజలకు ఉన్న మూఢ నమ్మకంపై అవగాహన కల్పిస్తాం. మార్చి 21 జాతీయ అటవీ దినోత్సవం,ప్రతి ఏడాది అక్టోబర్ వైల్డ్లైఫ్ వీక్ సెలబ్రెషన్స్ ఏర్పాటు చేస్తాం. – ప్రతిమ, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్