ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 16 : ప్రస్తుతం వరి సాగు కోసం కూలీల కొరత ఉండటంతోపాటు కూలీలు, ఇతరత్రా రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయరంగంలో తీసుకువస్తున్న నూతన విధానాలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ జేడీఏ గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని పోల్కంపల్లి అనుబంధ గ్రామమైన మాన్యగూడలో రైతులు మహవీర్రెడ్డి, మనోహర్రెడ్డి వ్యవసాయశాఖ ఏఈవో శ్రవణ్కుమార్ సూచనల మేరకు వెదజల్లే పద్ధతిలో సాగుచేసిన వరి పంట మంచి దిగుబడి వచ్చింది.
ఈ సాగుపై బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతోపాటు ఇతర రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కృపేశ్ మాట్లాడుతూ.. రైతులు ఎక్కడ కూడా నష్టాలపాలవకుండా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయశాఖ జిల్లా అధికారి గీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నూతన పంటలసాగు విధానంపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నది. జిల్లావ్యాప్తంగా వెదజల్లే పద్ధతి, నూతన రకం వరి పంట సాగు, సేంద్రియ, పచ్చిరొట్ట ఎరువుల వాడకంతోపాటు ఇతన నూతన విధానాలతో సాగుచేస్తున్న పంటలపై అవగాహన కల్పించేందుకు రైతులను క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు.
వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసిన రైతులు మహవీర్రెడ్డి, మనోహర్రెడ్డిలను జేడీఏ అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్ ఆండాళు, ఎంపీటీసీ మంగ, ఏవోలు వరప్రసాద్రెడ్డి, సందీప్, జ్యోతిశ్రీ, ఏఈవోలు శ్రవణ్కుమార్, రఘు, లింగస్వామి, సీఈవో లక్ష్మయ్య, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.