రంగారెడ్డి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కూరగాయలు, ఆకుకూరల సాగుపై అన్నదాతలు మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జించడంతో పాటు ఏడాది పొడవునా పంట దిగుబడి వస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ఈసారి 50 వేల ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయల సాగు చేశారు. హైదరాబాద్ నగరానికి జిల్లా ఆనుకుని ఉండడంతో రవాణా సౌకర్యం కలిసొచ్చింది. నిత్యం హైదరాబాద్లో జరిగే వారాంతపు సంతలకు కూరగాయలను తీసుకెళ్లి అమ్మి, తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. ఆకు కూరలతో పాటు టమాట, బీర, కాకర, బెండ, గోకరి, పచ్చిమిర్చి, క్యాప్సికం, బుడమ, చిక్కుడు, వంకాయ, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, దోసకాయ, కీరా వంటి పంటలను అధికంగా సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుండడం గమనార్హం.
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎక్కడా లేవు. సమృద్ధిగా వర్షాలు కురిశాయి. చెరువులు, కుం టలు, జలాశయాలు నిండితో నిండిపోయా యి. అన్ని రకాల పంటలకు సరిపడా నీరు అం దుతున్నది. అయినప్పటికీ వాణిజ్య పంటలు, సంప్రదాయ పంటలు వేద్దామంటే తెగుళ్ల బెడ ద, ఆర్థిక భారం పెరుగుతుందని అన్నదాతలు ఆలోచిస్తున్నారు. దీంతో ఉన్న కొద్దిపాటి భూ మిలో తక్కువ ఖర్చుతో సాగయ్యే కూరగాయల పంటలపై దృష్టి సారిస్తున్నారు.జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, మహేశ్వరం తదితర మండలాల పరిధిలోని గ్రామాల రైతులు ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
50 వేల ఎకరాల్లో సాగు..
రైతులు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. పెట్టుబడి పోను రెండింతల వరకు రాబడి వస్తుండటంతో సంప్రదాయ, వాణిజ్య పంటలైన వరి, పెసర, శనగ, పత్తి, కందులు వంటి పంటలను సాగు చేయకుండా కూరగాయల సాగును ఎంచుకున్నారు. అయితే, జిల్లాలో ఖరీఫ్, రబీ కత్తెర కాలాలను కలుపుకొని ఏడాదిలో 45 నుంచి 50 వేల ఎకరాల్లో రైతులు కూరగాయలను సాగు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వ రం, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్ర ధానంగా టమాట, ఆకుకూరలు, సొర, బీరకాయ, క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్, చిక్కుడు లాంటి పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. షాద్నగర్ మండలంలో 1,400 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు అవుతుండగా.. చేవెళ్ల మండలం లో 4,380 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు, ఇబ్రహీంపట్నం పరిధిలో 2,500 ఎకరాల్లో కూరగాయల పంటలు పండుతున్నాయి. అదేవిధంగా మహేశ్వరం, కల్వకుర్తి మండలాల పరిధిలోనూ ఆకుకూరలు, కూరగాయలు సాగవుతున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2022-23 వానకాలంలో మహేశ్వరం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కూరగాయలు 2022 ఎకరాల్లో సాగు కాగా.. ఆకుకూరలు 529.92 ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తంగా 2551.93 ఎకరాల్లో సాగు కాగా.. గతేడాదిలో వానకాలంలో 2693.13 ఎకరాల్లో కూరగాయలను రైతులు పండించారు.
ఆకుకూరలు..
పాలకూర, తోటకూర, చుక్క కూర, గోంగూర, బచ్చలికూర, పొన్నగంటి కూర, కొత్తిమీర, కరివేపాకు లాంటి ఆకుకూరలను రైతులు అధికంగా పండిస్తున్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం మండలంలోని మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, నయనంపల్లి, ఉప్పరిగూడ, కర్నగూడ, తుర్కగూడల్లో.. అదేవిధంగా మంచాల మండలంలోని సీలేరు, చిట్టాపూర్ గ్రామాల్లో.. చేవెళ్ల మండలంలోని రేగడి ఘనాపూర్, దేవరంపల్లి, ఖానాపూర్, మొయినాబాద్, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడల్లో అధికంగా పండిస్తున్నారు. కాగా, షాద్నగర్ మండలంలో ఆకుకూరల సాగు తక్కువగా ఉన్నది.
కూరగాయలు..
టమాట, బీరకాయ, కాకర, బెండకాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంకా య, క్యాబేజీ, బీట్రూట్, లాంటి కూరగాయలను షాద్నగర్, యాచా రం, చౌదర్పల్లి, మంచాల, చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం, శంకర్పల్లి మండలాల్లోని పలు గ్రా మాల్లో రైతులు అధికంగా పండిస్తున్నారు.
మార్కెట్ అంతా హైదరాబాదే..
జంట నగరాల చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయల సాగవుతున్నప్పటికీ.. వాటి క్రయవిక్రయాలన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. నగరంలోని గుడి మ ల్కాపూర్, మెహిదీపట్నం, శంషాబాద్, మాదన్నపేట, మిర్యాలమండి, ఇంకా వారాంతపు సంతల్లో కూరగాయలు, ఆకుకూరల కొనుగోలు అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రధాన ప్రాంతాలు మహానగరాన్ని ఆనుకొని ఉండటంతో ఎక్కడికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండటంతో రైతులకు ఇబ్బందుల్లేకుండాపోయిం ది. రైతులు తమ ఉత్పత్తులను ఉదయమే తమ గ్రామం నుం చి నగరానికి చేరుకుని అమ్ముకుని సాయంత్రంలోపు తమ ఇండ్లకు చేరుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయల విక్ర యాలతో రైతులకు పెట్టుబడిపోను అధిక రాబడి వస్తున్నది.
కూరగాయల సాగులో మంచి లాభాలు
కూరగాయల సాగుతో మంచి లాభాలొస్తాయి. నేను రెండు ఎకరాల్లో మిర్చి, వంకాయ పంటలను సాగు చేశా. ప్రస్తు తం పంట కాత దశలో ఉన్నది. నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నా. ఇతర పం టల కన్నా కూరగాయల పంటలను సాగు చేస్తే ఖర్చులు పోగా ఆదాయం మంచిగా వస్తుంది. వరి, పెసర, వేరుశనగ లాంటి పంటలు వేస్తే శ్రమ, పెట్టుబడి అధికంగా ఉంటుంది. దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర రావటం లేదు.
– పోచయ్య, రైతు కుమ్మరిగూడ, షాబాద్
నగరంలో విక్రయిస్తా
కూరగాయల సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని సాధించడంతోపాటు లాభాలను పొందొచ్చు.
ప్రతి ఏడాది నాకున్నా నాలుగు ఎకరాల భూమిలో.. మూడు ఎకరాల వరకు కూరగాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వంకాయ, టమాట, చిక్కుడుకాయలను పండిస్తా. రవాణా సౌకర్యం అందుబాటులో ఉండటంతో నగరానికి తీసుకెళ్లి విక్రయిస్తా. మిగతా పంటలతో పోల్చితే ఇందులో రాబడి అధికంగా ఉంటుంది.
– చిలుకల వెంకటయ్య, రైతు, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల