బొంరాస్పేట, నవంబర్ 2 : గ్రామపంచాయతీల ద్వారా ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పంచాయతీ కార్యదర్శులకు ‘డిజిటల్ కీ’లను అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు, ఇంటి పన్నుల వసూలు, గ్రామ సభల నిర్వహణ, జనన, మరణ, వివాహ ధ్రువపత్రాల జారీ, ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు, వసూలు చేసిన పన్నులకు రసీదులు ఇవ్వడం, పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లిండం వంటి పనులు పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నారు. వీటితోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను కూడా పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్నారు. ఇంత ఒత్తిడిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. అక్రమాలకు, కార్యదర్శుల్లో నిర్లక్ష్య ధోరణికి తావులేకుండా నూతన విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి డిజిటల్ కీతో సంతకాలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే గ్రామపంచాయతీల ద్వారా డిజిటల్ కీతో కార్యదర్శులు తమ సేవలను అందించనున్నారు.
‘డిజిటల్ కీ’తో సమస్యలకు చెక్
వికారాబాద్ జిల్లాలో 566 గ్రామపంచాయతీలుండగా 566 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. అన్ని రకాల పనులను చూసుకోవడం కారణంగా ధ్రువపత్రాలపై సంతకాలను చేయడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సి వస్తున్నది. ముఖ్యంగా జనన, మరణ ధ్రువపత్రాల జారీ గ్రామాల్లో నిరంతరం ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది కార్యదర్శులు సమాచార లోపంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు తప్పుడు సమాచారం నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో అవకాశమున్నా చాలా చోట్ల కార్యదర్శులు ఆఫ్లైన్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కార్యదర్శులకు డిజిటల్ కీ ఇవ్వడం ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడంంతో పాటు సంతకాలు ఫోర్జరీ చేసేందుకు ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
నేరుగా ఫోన్కు సమాచారం
డిజిటల్ సంతకాల విధానం అమలుతో జనన, మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యానికి తావుండదు. కొత్త విధానంలో కార్యదర్శులు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే. ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారుడు పంచాయతీ కార్యదర్శి చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. ధ్రువపత్రం సిద్ధం కాగానే దరఖాస్తుదారుడి సెల్ఫోన్కు సందేశం అందుతుంది. మీసేవ లేదా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి దానిని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం జనన, మరణ ధ్రువపత్రాలకు మాత్రమే డిజిటల్ సంతకాలు చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. భవిష్యత్తులో మిగిలిన అన్ని పనులకు డిజిటల్ సంతకాలు అమలు చేసే అవకాశముంది. వివాహ ధ్రువీకరణ పత్రాలు, గృహనిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, కొన్ని రకాల ఆన్లైన్ సర్వీసులకు డిజిటల్ సంతకాలను అనుసంధానం చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మ్యాపింగ్ జరుగుతున్నది : మల్లారెడ్డి, డీపీవో
జనన, మరణ ధ్రువత్రాలను ప్రతి గ్రామపంచాయతీలో ఆన్లైన్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో కార్యదర్శులకు డిజిటల్ కీ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 566 కార్యదర్శులకు డిజిటల్ కీ ఇవ్వడం కోసం వారి సంతకాలను ఆన్లైన్లో అనుసంధానం చేయడానికి మ్యాపింగ్ జరుగుతున్నది. ప్రస్తుతానికి జనన, మరణ ధ్రువపత్రాలను డిజిటల్ కీతో జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
డిజిటల్ కీ విధానం బాగుంది
– జైపాల్, పంచాయతీ కార్యదర్శి, దుద్యాల
పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ కీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం బాగుంది. ఈ విధానంలో జనన, మరణ ధ్రువపత్రాలను పారదర్శకంగా జారీ చేయడానికి అవకాశముంటుంది. సంతకాలను ఫోర్జరీ చేసే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు జనన, మరణాలను నమోదు చేసి డిజిటల్ కీతో ఇచ్చే అవకాశం కలుగుతుంది.