రంగారెడ్డి, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ వేళ మహేశ్వరం నియోజకవర్గానికి నిధుల వరద పారింది. ఈ ఘటన యావత్ నియోజకవర్గ ప్రజల్లో సంబురాలతో కూడిన ప్రత్యేక వెలుగుల్ని తెచ్చింది. నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి గురించి తపిస్తూ, ఒక్కో రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ప్రత్యేక విజన్తో ముందుకు వెళ్తూ ఇప్పటికే నూతన విద్యాలయాలు, జిల్లా లైబ్రరీ, డైట్ కళాశాల, దవాఖానలు, రోడ్ల పనులతో పాటు పర్యాటక రంగం వైపునకు అడుగులు కదుపుతున్నారు. విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి కృషితో విద్య, వైద్యం, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి కనీస సౌకర్యాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం పర్యాటక రంగం వైపునకు కూడా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే మీర్పేట చందనం చెరువు మినీ ట్యాంక్బండ్గా మారింది. అందంగా సుందరీకరించిన ఈ చెరువు వద్ద ప్రతి రోజూ పెద్ద ఎత్తున సందర్శకులు ఉదయం, సాయంత్రం సేద తీరుతూ, వాకింగ్, వ్యాయామం, చిన్న పిల్లలు ఆడుకోవడానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. జల్పల్లి చెరువుతో పాటు మరికొన్ని చెరువుల వద్ద సుందరీకరణ, ఓపెన్ జిమ్లు, రాక్ గార్డెన్, తదితర పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి.
చెరువుల సుందరీకరణకు రూ.8 కోట్ల నిధులు
తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిఫార్సుతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదు చెరువుల సుందరీకరణకు రూ.8 కోట్ల నిధులు విడుదల చేస్తూ హెచ్ఎండీఏ ఆదేశాలు జారీ చేసింది. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలో గల కోమటికుంట సుందరీకరణకు రూ.2 కోట్ల 50 లక్షలు, పోచమ్మ కుంటకు రూ.2 కోట్లు, మల్లాపూర్ సుధామోని కుంట చెరువు సుందరీకరణకు రూ.2 కోట్లు, గుర్రంగూడ ఎక్కమోని కుంట కట్ట మరమ్మతులకు రూ.50 లక్షలు, కుర్మల్గూడ చెరువు కట్ట పటిష్టతకు రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. నిధుల మంజూరు పట్ల కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా అడుగులు..
బడంగ్పేట కార్పొరేషన్లో ఐదు చెరువులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ఒక ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. చెరువుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, అన్ని తరగతుల వారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మహేశ్వం ఆదర్శవంతంగా ఉండాలి. ఆ విధంగానే నియోజకవర్గ దిద్దుబాటుకు అడుగులు వేస్తున్నాం.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి