2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో గులాబీ బాస్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో పలుమార్లు జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ తన ప్రసంగంతో ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. ఆయన స్ఫూర్తితోనే విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం ప్రజల మద్దతుతో అంచలంచెలుగా ఎదిగి నేడు గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ(బీఆర్ఎస్)ని ప్రకటించడంపై ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే దేశం పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5 : తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్కు రంగారెడ్డి జిల్లావాసులు బాసటగా నిలిచారు. నాయకులు, మేధావులు, ఉద్యోగులు, కులవృత్తులవారు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళలు సైతం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొనేవారు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే శ్రీశైలం-హైదరాబాద్, నాగార్జునసాగర్-హైదరాబాద్, బెంగళూరు-హైదరాబాద్, బీజాపూర్-హైదరాబాద్, ముంబయి-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి-హైదరాబాద్ రహదారులను ఎక్కడికక్కడ స్తంభింపజేశారు. సకలజనుల సమ్మెతో రోడ్లపైకి వచ్చి దీక్షలు చేశారు.
అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించకపోయినా జిల్లావాసులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనడం విశేషం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, పరిగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్ తదితర నియోజకవర్గాల్లోని సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని సీఎం కేసీఆర్కు మద్దతు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థులు, చేతివృత్తులవారు, మహిళలు, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమానికి ఊపిరి పోశారు.
ఉద్యమ సమయంలో రంగారెడ్డి జిల్లాలోని పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. ప్రజలను చైతన్యపరుస్తూ నిత్యం శ్రమించారు. అందులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి ఒకరు.
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సుమారు ఎనిమిది మంది అమరులయ్యారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి లక్ష్మయ్య, కొంగరకలాన్కు చెందిన కాకి కుమార్, ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరాల తిరుమలేష్, మొయినాబాద్ మండలం పెద్దమంగళారానికి చెందిన యాదిరెడ్డి, కేశంపేట్ మండలానికి చెందిన కరుణాకర్, ఫారూఖ్నగర మండలానికి చెందిన రాములు, మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య, ఎల్బీనగర్లో శ్రీకాంతాచారిలు ఉన్నారు.
వికారాబాద్, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా ప్రజలు మొదట్నుంచి సీఎం కేసీఆర్కు వెన్నంటే నిలిచారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి వికారాబాద్ జిల్లా కంచుకోటగా మారింది. ఉద్యమ సమయం నుంచి వికారాబాద్ జిల్లా అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం. ఈ ప్రాంత ప్రజల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకొచ్చారు. గులాబీ దళపతి కేసీఆర్ స్ఫూర్తితోనే విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఏ సభ, సమావేశం నిర్వహించినా జిల్లా ప్రజానీకం సీఎం కేసీఆర్ వెంట నడిచారు.
జిల్లాలోని ధారూరు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొదటి సారి టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దింపగా, స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 2004లో సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసింది. ఈ గెలుపుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే రాజకీయంగా ఎదగడంలో ఎంతో బలాన్నిచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం జరిగిన ఎన్నికల్లో సబ్బండ వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
2014 ఎన్నికల్లో వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయగా, 2018 ఎన్నికల అనంతరం వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఉద్యమ సమయంలో శుభప్రద్పటేల్ ఆధ్వర్యంలో వికారాబాద్లో నిర్వహించిన విద్యార్థి సంగ్రామ సదస్సులో వికారాబాద్ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశమంతా అమలు చేసేందుకు ముందడుగు వేసిన సీఎం కేసీఆర్ను జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు.