చేవెళ్ల రూరల్, అక్టోబర్ 5 : చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో విజయ దశమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణ స్వామి, ఆంజనేయస్వామికి క్షీరాభిషేకం చేశారు. చంద్రం సమర్పించి పూజలు చేశారు. అదేవిధంగా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి త్రివర్ణ పతాకాన్ని ఆవిషరించారు. పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, ఎంపీటీసీ స్వరూప, పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, ఉప సర్పంచ్ జహీరా బేగం, రామాలయ కమిటీ చైర్మన్ వంగ శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు వెంకటేశ్, శివ కుమార్, జై గోపమ్మ, సతీశ్గౌడ్, లావణ్య, రవీందర్, లక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు మోహన్ రెడ్డి, సుధాకర్ గౌడ్, సునీత, సూల్ కమిటీ చైర్మన్ అంజయ్య, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి ఆలయంలో బుధవారం విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మైసిగండి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆయిళ్ల శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. శ్రీనివాస్గౌడ్ అమ్మవారికి నూతన వస్ర్తాలు సమర్పించారు. అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ, అర్చనలు, హారతి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే వాహనాలకు పూజలు జరిపించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలీపంతూనాయక్, ఈవో స్నేహలత, నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, సర్పంచ్లు తులసీరాంనాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రాజారాంనాయక్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
హన్మాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో, పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో ప్రతిష్ఠించిన దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారు చివరిరోజు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి చీరను వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన మాదారం మహేశ్గౌడ్ రూ.25 వేలకు దక్కించుకున్నాడు. అనంతరం అమ్మవారిని మండల కేంద్రంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించి స్థానిక గుర్లకుంట చెరువులో నిమజ్జన ం చేశారు. ఊరేగింపులో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గల రామాలయ, శివాలయాల్లో అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. బుధవారం చివరిరోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో హోమాలు, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలీపంతూనాయక్, ఈవో స్నేహలత, నాయకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లో దసరా పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎలికట్ట అంబాభవానీ దేవాలయంలో భవానీమాతను దసరా పండుగ సందర్భంగా రాజరాజేశ్వరీదేవిగా అలకరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేసినట్ల్లు ఆలయ ప్రధాన అర్చకులు భవానీశంకర్, మల్లేశ్ పూజారి తెలిపారు.
షాద్నగర్టౌన్ : దేవీ శరన్నవరాత్రోత్సవాలు షాద్నగర్ పట్టణంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో, పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు శాంతాదేవిగా పూజలందుకున్నది. దేవాలయం ఆవరణలో హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయ ముఖద్వారాన్ని వివిధ పండ్లు, పూలతో అలంకరించారు. శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో తెల్లవారు జామున మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన దేవీ శరన్నరాత్రోత్సవాలు ముగిశాయి. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులను నుంచి విశేష పూజలందుకున్న దుర్గామాత ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. మండలంలోని సురంగల్ గ్రామంలో దసరా పండుగ రోజు అమ్మవారిని నిమజ్జన కార్యక్రమానికి తరలించారు. ఊరేగింపు కన్నుల పండువగా నిర్వహించారు.