తాండూరు, అక్టోబర్ 4: పోలీస్ శాఖలో సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాయి. నేరాల నియంత్రణకు ప్రజలకు సాంకేతికతపై అవగాహన కల్పిస్తూ పోలీసులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో అవి నేరాల నియంత్రణతోపాటు కేసుల సత్వర పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలు, దాతల సహకారంతో గ్రామాలు, పట్టణంలోని వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వేగంగా జరుగుతున్నది. పోలీస్శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో 150, గ్రామీ ణ ప్రాంతాల్లో 200 వరకు నియోజకవర్గంలో ఇప్పటివరకు 350 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రైవేటుగా మరో 300వరకు సీసీ కెమెరాలు పోలీసుల నిఘా లో ఉన్నట్లు తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డి తెలిపారు.
ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా పోలీస్ శాఖ చేపట్టిన మేము సైతం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నది. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులతోపాటు ప్రధాన చౌరస్తాల్లో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా నియోజకవర్గంలో ని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో 200 వర కు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో సీసీ కెమెరా ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల్లోని వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ, అక్రమాలను అరికట్టడంతోపాటు కేసుల ఛేదనలకు అవి ఎంతో కీలకంగా ఉపయోగపడుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అనుమానితులను త్వరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
దాతలు సహకరించాలి
పలు కేసులను ఛేదించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయి. దాతలు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావా లి. ఒక్క కెమెరా వందమంది పోలీసులతో సమానం.
-రాజేందర్రెడ్డి, తాండూరు పట్టణ సీఐ