వికారాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 52.90 శాతం ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. అయితే బీఎల్వోలు జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోని క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ వివరాలను సేకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 8,71,391 మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు 4,61,041 ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యింది. మరో 4,10, 350 ఓటరు గుర్తింపు కార్డులకు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు ఆధార్ సీడింగ్ ప్రక్రియలో జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం ముందంజలో ఉండగా.. వికారాబాద్ నియోజకవర్గం వెనుకంజలో ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో 2,13,692 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకు 1,36,316 ఓటరు కార్డులకు, పరిగి నియోజకవర్గంలో 2,30,928 మందికి 1,31,799., తాండూరు నియోజకవర్గంలో 2,15, 778 మందికి 1,06,560., వికారాబాద్ నియోజకవర్గంలో 2,11,163 మంది ఓటర్లకు.. ఇప్పటివరకు 86,366 ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయింది.
సీడింగ్కు స్వచ్ఛందంగా ముందుకు..
ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ తప్పనిసరి కానప్పటికీ.. జిల్లా ఎన్నికల యంత్రాంగం జిల్లాలోని ఊరూరా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో జిల్లావ్యాప్తంగా ఓటర్లు ఆధార్ సీడింగ్కు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయినట్లయితే బోగస్ ఓటర్లకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రస్తుతం చాలామంది ఓటర్లు రెండు, మూడు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు. ఓటరు గుర్తింపు కార్డుల ఆధార్ సీడింగ్ ప్రక్రియలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆయా శాఖలను కూడా భాగస్వాములను చేసింది. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది., అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మహిళా ఓటర్ల వివరాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది., జిల్లా విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారుల ద్వారా కాలేజీ విద్యార్థుల వివరాలను., ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఓటర్ల వివరాలను జిల్లా పరిశ్రమల శాఖ., గ్రామాలు, పట్టణాల్లో యువజన సంఘాల సభ్యుల వివరాలను యువజన సర్వీసు శాఖ ద్వారా ఆధార్ కార్డు వివరాలను బీఎల్వోలు సేకరించి వెంటనే ట్యాబ్ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
జిల్లాలో 8,71,561 మంది ఓటర్లు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,71,561 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,30,928 మంది ఓటర్లుండగా.. పురుషులు-1,17,808, మహిళలు-1,13,112, ఇతరులు-8 మంది ఓటర్లు., వికారాబాద్ నియోజకవర్గంలో 2,11,163 మంది ఓటర్లకు.. పురుషులు-1,06,902, మహిళలు-1,04,258, ఇతరులు ముగ్గురు ఓటర్లున్నారు. తాండూరు నియోజకవర్గంలో 2,15,778 మంది ఓటర్లకు.. పురుషులు-1,05,933, మహిళలు-1,09,837, ఇతరులు 8 మంది ఓటర్లు., కొడంగల్ నియోజకవర్గంలో 2,13,692 మంది ఓటర్లకు పురుషులు-1,06,513, మహిళలు-1,07,173, ఇతరులు-ఆరుగురు ఓటర్లున్నారు.