బొంరాస్పేట, అక్టోబర్ 2: బొంరాస్పేట మం డలం నుంచి కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలాన్ని సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రోజు నుంచే పాలన కూడా షురూ కానున్నది. ప్రభుత్వం 2016లో కొత్తగా జిల్లా లు, మండలాలను ఏర్పాటు చేసిన సమయంలోనే దుద్యాల మండలాన్ని కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. ప్రజల ఆకాంక్షను గుర్తించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దుద్యాల మండల ఏర్పాటుకు కృషి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నిలబెట్టుకున్నా రు. కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో దుద్యాల, చిల్ముల్మైలారం, గౌరారం, హంసాన్పల్లి, ఈర్లపల్లి, లగచెర్ల, అల్లికాన్పల్లి, సండ్రకుంటతండా, సాగారంతండా, ఎక్కచెరువుతండా, చెట్టుపల్లితండా, నాస్కంపల్లి, దౌల్తాబాద్ మండలంలోని ఆలేడు, కుదురుమల్ల గ్రామాలతోపాటు గతంలో బొంరాస్పేట మండలంలో ఉన్న హకీంపేట, పోలేపల్లి, పల్లెగడ్డ గ్రామా లు ఉన్నాయి. కొత్త మండల ఏర్పాటుతో పాలన మరింత చేరువ అవుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదట రెండు కార్యాలయాలు..
దుద్యాల మండలంలో మొదటగా తహసీల్దార్, ఎంఈవో కార్యాలయాలను మంత్రి సబితారెడ్డి, ఎంపీ, జడ్పీచైర్పర్సన్తో కలిసి ప్రారంభించనున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఒక భవనంలో ఎంఈవో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకోసం దుద్యాలలోని రైతువేదిక భవనం, పంచాయతీ కార్యాలయం, ఉర్దూ మీడియం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతోపాటు పలు ప్రైవేటు భవనాలను కూడా అధికారులు పరిశీలించి కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. పోలీస్స్టేషన్ను దుద్యాల మండలంలోని హకీంపేటలో ఏర్పాటు చేయాలని పోలేపల్లి, హకీంపే ట గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీంతో దీనిని పెండింగ్లో ఉంచారు. ప్రస్తుతం తహసీల్దార్, ఎంఈవో కార్యాలయాలకోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల భవ నాలకు రంగులు వేసి బోర్డులు రాసి అధికారులు ముస్తాబు చేశారు.
మంత్రి పర్యటనను జయప్రదం చేయాలి
దుద్యాల మండల ప్రారంభోత్సవానికి హాజరవుతున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ బొంరాస్పేట మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి కోరారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దుద్యాల మండల ప్రారంభంతోపాటు మెట్లకుంటలో సీసీ రోడ్డు నిర్మాణం, రేగడిమైలారంలో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన, తుంకిమెట్లలో రూ.3 కోట్లతో నిర్మించిన చెక్డ్యాం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని తెలిపారు. మండల ప్రారంభం అనంతరం భారీ ర్యాలీ ఉంటుందని.. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యాదగిరి కోరారు. సమావేశంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు తిరుపతయ్య, నర్సింహులు, కో-ఆప్షన్ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.