తెలంగాణలో చెరువులు, కుంటల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం రంగారెడ్డిజిల్లాలో సత్ఫలితాలనిచ్చింది. వర్షపు నీటిని ఒడిసిపట్టి, నీరు వృథా కాకుండా ఉండడం కోసం గొలుసుకట్టు చెరువుల మరమ్మతులకు పెద్దఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయించింది. నీటి పరీవాహక ప్రాంతాల్లో చెక్డ్యాంలను కూడా నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. గొలుసుకట్టు చెరువులతోపాటు వాగుల మరమ్మతుల కారణంగా నీరు వృథా కాలేదు. జిల్లావ్యాప్తంగా నిర్మించిన చెక్డ్యాంలు కూడా పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి.
జిల్లాకు విడుతలవారీగా మంజూరైన నిధులు
మొదటి విడుత రూ.29.46కోట్లు
రెండో విడుత రూ.67.91కోట్లు
మూడో విడుత రూ.12.04కోట్లు
నాలుగో విడుత రూ.21.06కోట్లు
పొంగిపొర్లుతున్న చెక్డ్యాంలు
ఇరిగేషన్శాఖతో పాటు ఉపాధి హామీ, వాటర్షెడ్ పథకాల కింద జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం పెద్దవాగు, రాచకాల్వ, ఫిరంగినాలా కాల్వ, పులిందర్వాగుతోపాటు జిల్లావ్యాప్తంగా ఇతర వాగుల్లో నిర్మించిన చెక్డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి ప్రవహిస్తున్నాయి.
ఆనందంలో రైతులు, మత్స్యకారులు
మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల మరమ్మతులు సత్ఫలితాలివ్వడంతో నీరు సమృద్ధిగా చేరింది. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడుతలో చెరువుల్లో చేపలు వదిలింది. రెండో విడుతలో భాగంగా జిల్లా ప్రతినిధులు, అధికారులు చేపలు వదులుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 121 మత్స్యకార సొసైటీ సభ్యులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. 121 సొసైటీల్లో సుమారు పదివేలమందికి పైగా మత్స్యకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. చెరువులు, కుంటల కింద ఉన్న ఆయకట్టు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా చెరువులు, కుంటలు
జిల్లాలోని 21 మండలాలు, 16 మున్సిపాలిటీల్లో మొత్తం నాలుగు విడుతల్లో మంజూరైన రూ.131కోట్లతో 1009 చెరువులు, కుంటల మరమ్మతు చేపట్టగా దాదాపు పూర్తయ్యాయి. దీంతో అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండాయి. ముఖ్యంగా ఎన్నో ఏండ్లుగా ఎండిపోయిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కూడా ఇటీవల రూ.16కోట్లతో మరమ్మతు చేపట్టగా పూర్తిగా నిండింది. 52 అడుగుల నీటి సామర్థ్యంగల పెద్దచెరువు ఇప్పటికే 38 అడుగులకు చేరింది. ఇంకా పెద్దవాగుతో పాటు రాచకాల్వ నుంచి కూడా చెరువులోకి వర్షపునీరు వచ్చి చేరుతుంది. ఈ వర్షాకాలంలో పెద్దచెరువు పూర్తిస్థాయిలో నిండే అవకాశాలున్నాయి. రావిర్యాల పెద్దచెరువు, తుర్కయాంజాల్ మాసాబ్చెరువు, లింగంపల్లి సాబిత్నగర్ చెరువు, చింతపట్ల కాముని చెరువు, మేడిపల్లి సాలిచెరువు, ఆరుట్ల చిన్నబంధం, పెద్దబంధం తదితర మండలాల్లోని చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి.
చెరువులు, కుంటలకు మరమ్మతులు
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో మిషన్ కాకతీయ కింద సుమారు 1009 చెరువులు, కుంటలకు మరమ్మతు పనులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు విడుతల్లో రూ.131కోట్లను కేటాయించారు. ఈ నిధులతో దశలవారీగా చెరువులు, కుంటల మరమ్మతులతోపాటు చెక్డ్యాంల నిర్మాణం కూడా చేపట్టారు. జిల్లా ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో చెరువులు, కుంటల మరమ్మతులతోపాటు చెక్డ్యాంల నిర్మాణం కూడా చేపట్టారు. గొలుసుకట్టు చెరువుల మధ్య ఉన్న వాగుల నిర్మాణం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే చెరువులు, కుంటల మరమ్మతు సాధ్యమైంది
– కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువు, కుంటల మరమ్మతు కోసం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోవడంతో వర్షపు నీరు పూర్తిగా సద్వినియోగమైంది. ఫలితంగా జిల్లాలో కరువును జయించినట్లయ్యింది.
విడుతలవారీగా చెరువులు, కుంటల మరమ్మతు పనులు
– హైదర్ఖాన్, జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ
మిషన్ కాకతీయలో భాగంగా నాలుగు విడుతల్లో మంజూరైన రూ.131 కోట్లతో చెరువులు, కుంటల మరమ్మతును చేపట్టాం. నాలుగు విడుతల్లో జిల్లావ్యాప్తంగా వెయ్యికి పైగా చెరువులు, కుంటల మరమ్మతు పనులు పకడ్బందీగా చేశాం. వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచేలా చెక్డ్యాంల నిర్మాణం కూడా చేపట్టాం. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి. మరో రెండేండ్లపాటు జిల్లాలో భూగర్భజలాలకు ఢోకా లేదు.