పరిగి, సెప్టెంబర్ 28: ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన మందులను పూర్తిస్థాయిలో నిల్వ ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ సెంట్రల్ మెడిసిన్ స్టోర్(సీఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో ఏర్పాటు కానుండగా..మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో 2023-24లో రూ.3.60 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను ఏర్పాటు చేయనున్నారు.
వికారాబాద్ జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 యూపీహెచ్సీలున్నాయి. ఈ దవాఖానలకు ప్రతిరోజూ దాదాపుగా వందమంది కంటే ఎక్కువగానే ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అవసరమైన వసతులను కల్పించడంతోపాటు వైద్యులు, సిబ్బంది నియామకాన్ని చేపడుతున్నది. పీహెచ్సీలతోపాటు పల్లె దవాఖానలను కూడా ఏర్పాటుచేసి నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నది.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు కానున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ఎల్లప్పుడూ మందులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్టోర్లో కనీసం మూడు నెలలకు సరిపడా మందులను నిల్వ ఉంచుతారు. ఎప్పటికప్పుడు మూడు నెలలకు సరిపడా స్టాకును నిర్వహించాల్సిందిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు సరిపడా మందులను ఈ స్టోర్ నుంచే సరఫరా చేయనున్నారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులు(ఇన్పేషెంట్లు, ఔట్పేషెంట్లకు) నిర్ణీత కోర్సు మేరకు మందులను ఇస్తారు. రోగికి అవసరమైన మం దులను అందించేందుకు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటు ఎంతో దోహదపడనున్నది. ఎలాంటి మందుల కొరత లేకుండా చూడాలన్నదే ఈ సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటు లక్ష్యం. రూ.3.60 కోట్లతో ఈ స్టోర్ను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. రిఫ్రిజిరేటర్లు, వివిధ రకా ల మందులు, వ్యాక్సిన్ల స్టాకును నిల్వ చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటు ద్వారా అన్ని రకాల మందులు, వ్యాక్సి న్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు ఇక్కడి నుంచే అవసరమైన మందుల సర ఫరా జరుగుతుంది. కనీసం మూడు నెలలకు సరిపడా మందులను నిల్వ చేసుకునేలా ఏర్పాటు చేయాలన్నదే ఈ స్టోర్ల ప్రధాన ఉద్దేశం. అలాగే రోగికి అవసరమైన మందులను వైద్యలు ఇవ్వనున్నారు.
-డాక్టర్ పాల్వన్కుమార్,డీఎంహెచ్వో, వికారాబాద్ జిల్లా