ఉమ్మడి జిల్లాలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు పోటీపడి అమ్మవార్లను అలంకరిస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దేవీశరన్నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హోమాలు, కుంకుమార్చన, హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల్లో ఆలపించిన భక్తి పాటలు భక్తులను పరవశింపజేశాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
కడ్తాల్, సెప్టెంబర్ 28 : మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా, మైసిగండి గ్రామంలోని రామాలయ, శివాలయాల్లో కొలువైన అన్నపూర్ణేశ్వరిదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం మైసిగండి గ్రామంలో అమ్మవారు గాయత్రీదేవిగా, కడ్తాల్లోని అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హోమాలు, అమ్మవారికి కుంకుమార్చన, హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట అంబభవానీ ఆలయంలో భవానీమాతను గాయత్రీదేవిగా అలకరించారు. గురువారం లలితాత్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు భవానీశంకర్, మల్లేశ్ పూజారి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. యువ గాయకులు నర్సింహ, శివ ఆలపించిన భక్తి గీతాలకు భక్తులు పరవశించిపోయారు.
ఆమనగల్లు : పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని అమ్మవారు లలితాదేవి ఆవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పారాయణం చేశారు.
షాద్నగర్టౌన్ : పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు సంతానలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆర్యవైశ్య, యువజన సంఘం సభ్యులు తెలిపారు. మున్సిపాలిటీలోని పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు.
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, నేతలు, భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బసవన్నకట్ట సమీపంలోని అమ్మవారిని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న దర్శించుకున్నారు.