ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27 : జిల్లాలో పత్తిరైతులకు గిట్టుబాటు ధర కల్పించటంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మార్కెటింగ్, వ్యవసాయాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోలుపై వ్యవసాయ, మార్కెటింగ్శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని పత్తి మిల్లుల్లో పనిముట్లు, పనితీరును, సదుపాయాలను విస్తృతంగా తనిఖీ చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. 2022-23 వానకాలం సీజన్లో సాగుచేసిన పత్తి దిగుబడులను పూర్తిస్థాయిలో అంచనా వేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.6380 అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా తూనికలు, కొలతల అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారి, సీసీఐ సిబ్బంది, పత్తి మార్కెట్ కార్యదర్శులు, పత్తి మిల్లు ట్రేడర్స్ పాల్గొన్నారు.
హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి
హరితహారంలో భాగంగా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అమయ్కుమార్ ఆయా మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో హరితహారం, ఉపాధిహామీ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరానికి హరితహారంలో వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉండగా, జిల్లాలో కొన్ని మండలాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయని అన్నారు. లక్ష్యాన్ని చేరుకోలేని మండలాల్లో శనివారం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ చెప్పారు. నర్సరీల్లో పెంచిన మొక్కల వివరాలు మండలాలు, గ్రామాల వారీగా జిల్లా కార్యాలయానికి ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణాలు ప్రతి మండలంలోని గ్రామాల్లో త్వరగా పూర్తి చేయాలన్నారు. 2023 సంవత్సరానికి హరితహారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అందజేయాల్సిందిగా ఎంపీడీవోలను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవోలు, ఏపీవోలు, అధికారులు పాల్గొన్నారు.