బంట్వారం, సెప్టంబర్ 22 : మండల కేంద్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. సుమారు రూ.8 లక్షలతో పార్కు నిర్మాణం చేపట్టారు. పార్కును అభివృద్ధి చేసేందుకు బోరు బావి తవ్వించారు. దీని ద్వారా చెట్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి మొక్కకు నీరు అందాలని, డ్రిప్ పరికరాలను అమర్చారు. ఈ నిర్వహణకు ప్రత్యేకంగా కూలీలను నియమించారు. పార్కులో ఉన్న చెత్తాచెదారం సేకరించి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అంతేకాకుండా మొక్కల సంరక్షణ కోసం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు.
రెండు వేలకుపైగా మొక్కల పెంపకం
వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మొక్కలను పార్కులో నాటారు. మలబార్వేప, బాదాం, మారేడు, అల్లనేరేడు, రావి, జామ, పారిజాతం, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, శ్రీగంధం, ఇప్ప, రేగు, పనస, జంబి, కొబ్బర, పోక, పొగడ, మహాగని, మల్లే, తులసి, గన్నేరు, కృష్ణతులసి, అల్లనేరేడు, గులాబీ, గన్నేరు, వెదురు, కోనకర్పస్, నూరువరాలు, మందారం పుమాదియాపుతిక్, బ్యాక్ సైకన్, స్టార్ ఫైట్, తూజ, జట్రోపా, పాపయ్య, మునగ, ఉసిరి, చింత తదితర మొక్కలను నాటారు.
ప్రభుత్వ నిధులతో గ్రామాభివృద్ధి
ప్రభుత్వం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పార్కులు, శ్మశాన వాటికలు, రోడ్లు, వీధుల్లో శుభ్రతకు ఇచ్చే నిధులతో అందంగా తీర్చిదిద్దుతున్నాం. పారుశుధ్య కార్మికులు గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్తను నిల్వ ఉంచకుండా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. జడ్పీ, ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో గ్రామాభివృద్ధిని చేస్తున్నాం.
– లావణ్య, సర్పంచ్, బంట్వారం