రంగారెడ్డి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : మూడు నెలలుగా వేతనాలు అందక అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం అల్లాడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి వేతనాలు రావడం లేదు. బడ్జెట్ లేకపోవడం వల్లనే వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా.. ధర్నాలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు.
జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1600 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,380 మెయిన్ కేంద్రాలు కాగా.. 220 వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,828 మంది టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు. గత డిసెంబర్ నెలతోపాటు ఈ ఏడాదికి సంబంధించి జనవరి, ఫిబ్రవరి మాసాల వేతనాలు నిలిచిపోయాయి.
బడ్జెట్ సమస్యతోనే వేతనాలు నిలిచిపోయాయంటూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నదని, అది క్లియర్ అయితే వేతనాలు విడుదలవుతాయని పేర్కొంటున్నారు. అయితే ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ అయి వేతనాలు వస్తాయో! అన్నదానిపై అధికారవర్గాల వద్ద కూడా స్పష్టత లేదు. మొదటి తారీఖు మాట దేవుడెరుగు.. నెలనెలా రావాల్సిన వేతనాలే రావడంలేదని వాపోతున్నారు. జీతాలు లేక అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ ఉద్యోగుల పక్షపాతిగా కేసీఆర్ ప్రభుత్వం వారి వేతనాలను గణనీయంగా పెంచింది. ఏడేండ్ల కాలంలో మూడురెట్ల కంటే అధికంగా టీచర్లకు, మూడున్నర రెట్లు వేతనాన్ని మినీ అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు పెంచారు. దీంతో టీచర్లకు గౌరవ వేతన రూపంలో రూ.13,650, హెల్పర్లకు రూ.7,800 చొప్పున కాస్త అటూ ఇటుగా.. నెలనెలా ఠంచన్గా గత ప్రభుత్వం అందిస్తూ వచ్చింది.
కానీ.. కొత్త ప్రభుత్వంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వేతనాల కోసం ధర్నాలు, నిరసనలు చేపట్టిన సందర్భాలు కోకొల్లలు. మళ్లీ ఇన్నాళ్లకు వేతనాల కోసం అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చాయని ఆయా వర్గాలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి.