ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: 20 ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు జలకళ సంతరించుకున్నది. పెద్దచెరువు నిండుకుండలా మారడంతో ఈ ప్రాంత రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకట్టపైకి చేరుకుని నీటి అందాలను వీక్షిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాలైన కందుకూరు, శంషాబాద్ తదితర మండలాల్లోని చెరువులు, కుంటల నుంచి ఇబ్రహీంపట్నం చెరువుకు పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతున్నది. ఆకులమైలా రం, మీర్ఖాన్పేట్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్దవాగు నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. అలాగే రాచకాల్వ నుంచి కూడా ఇప్పటికీ వరద తీవ్రంగా వస్తున్నది.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటిమట్టం 48 అడుగులు కాగా ప్రస్తుతం 30 అడుగులకు చేరింది. గత ఇరవై ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా 30 అడుగుల వరకు నీరు ఉన్నది. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో మరో రెండు రోజుల్లో నీటిమట్టం మరిం త పెరిగే అవకాశమున్నది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నీటి సామర్థ్యం సుమారు రెండు టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం ఒక టీఎంసీకి పైగానే వరద నీరు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చెరువుకు వరద నీరు వస్తున్నది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు చెరువుకు వరద నీరు మరింత పెరిగే అవకాశమున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారడంతో ఈ ప్రాంత మత్స్యకారులు, ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీరు లేకపోవడంతో గత 20 ఏండ్లుగా ఆయకట్టు భూములు బీడుగా మారాయి. ప్రస్తుతం చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. మరోవైపు తూముల నుంచి వచ్చే నీటితో రైతులు తమ పంటపొలాలను సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో మత్స్యకారులు ఇటీవలే చేప పిల్లలను వదిలారు.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగం గా చెరువులు, వరద వాగుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం పెద్దవాగుకు కూడా రూ.16 కోట్లను కేటాయించి.. పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టడంతో వరదనీరు నేరుగా చెరువుకు చేరుతున్నది. పెద్దవాగులో గతంలో పలుచోట్ల గండ్లు పడటమే కాకుండా ఫిల్టర్ ఇసుకకోసం పెద్ద ఎత్తున గోతులను తవ్వారు. మిషన్ కాకతీయలో భాగంగా గండ్లకు మరమ్మతులు చేపట్టి గోతులను పూడ్చివేశారు.