ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మొట్టమొదటి అండర్పాస్ రోడ్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సాగర్ రహదారి నుంచి ఉప్పరిగూడ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లను ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. త్వరలోనే ఈ రోడ్డు పనులను ప్రారంభించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని శేరిగూడ సమీపంలోని పెద్దచెరువుకట్ట నుంచి ఉప్పరిగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు ఉంది.
ఈ రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తుంండటం వలన ఉప్పరిగూడకు వెళ్లడానికి రోడ్డు దాటే క్రమంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉప్పరిగూడ రోడ్డు సమీపంలోనే పెద్ద మూలమలుపులు ఉండటం వల్ల ప్రమాదాలు ఇటీవల అధికమయ్యాయి. దీంతో రోడ్డు దాటి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంలోనే ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద సుమారు పదికి పైగా ప్రమాదాలు జరిగాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి సాగర్ రహదారి నుంచి ఉప్పరిగూడకు అండర్పాస్ రోడ్డు నిర్మించాలని గతంలో పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం ఉప్పరిగూడ అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరుచేస్తూ ఇటీవల జీవోను విడుదల చేసింది. నిధలు మంజూరు కావడంతో త్వరలోనే పనులు ప్రారంభించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉప్పరిగూడ, పోచారం గ్రామాల ప్రజలు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లాలన్నా ఈ మూలమలుపు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కానీ, సాగర్ రహదారిపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగడంతోపాటు ప్రమాదకరంగా మారిన మలుపుతో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదకర మలుపు వద్ద అండర్పాస్ రోడ్డును ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద ఉన్న చెరువుకట్టతో పాటు మూలమలుపు వద్ద ఉప్పరిగూడ, పోచారం గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందిని పూర్తిగా తొలగించేందుకు ఈ అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించింది. ఈ రోడ్డు నిర్మాణం పనులు అతి త్వరలో ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారు. నిర్మాణం పూర్తయితే ప్రజల సమస్య పూర్తిగా తొలిగిపోనుంది.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
ఉప్పరిగూడ గ్రామానికి వెళ్లాలంటే శేరిగూడ సమీపంలోని మూలమలుపు వద్ద చెరువుకట్టపై అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల నివారణకు అండర్పాస్ రోడ్డు నిర్మాణం చేయాలని పలుమార్లు ఎమ్మెల్యేను కోరిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయించడం సంతోషంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంతో ఉప్పరిగూడ, పోచారం గ్రామ ప్రజల సమస్య పూర్తిగా తీరనుంది. ఈ రోడ్డు నిర్మాణానికి కృషిచేసిన ఎమ్మెల్యే కిషన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.