వర్గల్, జూలై 2: అద్దెకరమే ఆయనకు ఆదెరువైంది.. ఆరుతడి పంటలు అతనికి నికర ఆదాయం తెచ్చి పెడుతున్నది. వర్గల్ మండలం సింగాయిపల్లి గ్రామానికి చెందిన రైతు బోయిని రాజుకు రెండెకరాల పొలం ఉంది. మిగతా పొలం వానలు పడితే సాగు.. లేకపోతే ఆగు.. అన్నట్లుగా ఉంది. అద్దెకర భూమి మెట్టప్రాంతం కావడంతో 20 ఏండ్ల కిందనే బోరు వేశాడు.
ప్రస్తుతం తాను సాగు చేస్తున్న అద్దెకరంలో ఎనిమిది గుంటల్లో వంకాయ, మరో ఆరు గుంటల్లో పచ్చిమిర్చి, మరో ఆరుగుంటల్లో స్వీట్ కార్న్ సాగు చేస్తున్నాడు. ఇంతకు ముందు టమాట, గోకర సాగు చేశాడు. మార్కెట్ సదుపాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు డబ్బులు తోడవ్వడంతో పట్టిందల్లా బంగారంగా మారింది.
నా పేరు బోయిని రాజు. తాతల కాలం నుంచి ఎవుసాయమే జీవనాధారంగా బతుకుతున్నాం. పేరడు ఎకరంన్నర ఉంది. తోట పొలం అద్దెకర ఉంది. అద్దెకరలో యాడాది పొడుగునా ఏదో ఒకటి కూరగాయ పంట పండిస్తున్న. మిగతా ఎకరంన్నరలో ఆనదేవుడు కనికరిస్తే పంట. లేకపోతే అంతే సంగతి! ఇంతకుముందు పండిచ్చిన కూరగాయలకు మార్కెట్ వసతి లేకపోవడంతో ఇబ్బందిగా ఉండేది. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ అయినంక ఢోకాలేకుండా అయింది.
పొద్దుగల ఏరిన కూరగాయలు సాయంత్రం వరకు మార్కెట్కు తీసుకపోయి అమ్ముకొస్తున్నం. దీనికి తోడు సీఎం కేసీఆర్ మా మండలంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు, మార్కెట్ సదుపాయం కల్పించడంతో కూరగాయల సాగుపై మరింత ఆసక్తి పెరిగింది. విత్తనాల ఖర్చులకు రైతుబంధు డబ్బులు కూడా పడనుండటంతో సావుకారి దగ్గరికి పోకుండా అయింది. ప్రస్తుతం పిచ్చిమిర్చి, వంకాయ ధరలు 10 కిలోలకు రూ.200 నుంచి రూ.300 మధ్య నడుస్తున్నయ్.
– బోయిని రాజు, రైతు, సింగాయిపల్లి, వర్గల్