తాండూరు రూరల్, జూలై 1 : గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తెలంగాణ సర్కార్ ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే గ్రామ గ్రామాన నేడు క్రీడా ప్రాంగణాలు వెలుస్తున్నాయి. గతంలో పెద్ద పట్టణాల్లో మాత్రమే మినీ, భారీ స్టేడియాలు ఉండేవి. క్రీడలు ఆడేవారు అక్కడికి వెళ్లి ప్రాక్టీసు చేసేవారు. గ్రామాల్లో సరైన వసతులు లేక చాలా మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులు (యువతీ, యువకులు) మరుగునపడిపోతున్నారు. అలాంటి వారి కోసం తెలంగాణ సర్కార్ ప్రతీ గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
మారుమూల గ్రామాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికి తీసేందుకు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు క్రీడా ప్రాంగణాల కోసం అర ఎకరం నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి ఈజీఎస్ పథకం కింద రూ.2.50 లక్షలు మంజూరు చేశారు.
వికారాబాద్ జిల్లాలో 566 పంచాయతీలను గుర్తించారు. అందులో 711 క్రీడా ప్రాంగాణాలను నిర్మించనున్నారు. క్రీడా ప్రాంగణాల నిర్మాణాలకు అధికారులు 414 ఎకరాలను గుర్తించారు. క్రీడా ప్రాంగణం నిర్మించిన తర్వాత చుట్టూ 89,753 మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటేందుకు 49 వేల గుంతలు తవ్వారు. ఇప్పటి వరకు 23,000 మొక్కలు కూడా జరిగింది. ఈ మొక్కల నాటడంతోపాటు సంరక్షించేందుకు ఓ వాచర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
గ్రామీణ క్రీడా ప్రాంగణంలో ముందు ఓ ఆర్చీ ఏర్పాటు చేస్తారు. అందులో ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా యువత వ్యాయామం చేసేందుకు బార్ డబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. క్రీడా ప్రాంగణం చుట్టూ నాటే మొక్కలను రెండు సంవత్సరాల పాటు సంరక్షించేందుకు ఓ వాచర్ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 166 క్రీడా ప్రాంగణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 36 క్రీడా ప్రాంగణాలను అధికారులు పూర్తి చేశారు.
కొన్ని గ్రామాల్లో స్థల సమస్యలు ఉండడం వల్ల పనులు ప్రారంభించలేదు. మిగితా అన్ని గ్రామాల్లో క్రీడా మైదానాల పనులు మొదలు పెట్టారు. తాండూరు మండలం పైలెట్ ప్రాజెక్టు కింద కరణ్కోట, సిరిగిరిపేట గ్రామాలను తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలను పూర్తి చేశారు. మిగితా గ్రామాల్లో క్రీడా మైదానాల పనులను ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. మండలంలో ఎంపీడీవో, ఎంపీవో, ఉపాధి హామీ పథకం అధికారులు నిత్యం సందర్శిస్తూ పనులను పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు మండలంలో కరణ్కోట గ్రామానికి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేయడం సంతోషం. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది. సీఈవో జానకీరెడ్డితోపాటు ఎంపీడీవో, ఎంపీవో, ఈజీఎస్ అధికారులు పల్లె ప్రగతిలో సందర్శించారు. క్రీడా ప్రాంగణాన్ని పూర్తి చేశాం. గ్రామీణ యువతకు ఉపయోగకరం.
– హేమంత్కుమార్, ఉపసర్పంచ్, కరణ్కోట