ఇప్పటికే ‘అనంతగిరి దర్శిని’పేరిట అందుతున్న సేవలు ‘హైదరాబాద్ దర్శిని’పేరిట ప్రత్యేక బస్సులు టీఎస్ ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం సేవలను విస్తృతం చేస్తూ ఆదాయాన్ని సైతం పెంచుకుంటున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి, వికారాబాద్, తాండూరు డిపోల నుంచి హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ‘హైదరాబాద్ దర్శిని’ పేరిట ప్రత్యేక బస్సులను నడిపించేందుకు టీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా ప్లానిటోరియం, ఎన్టీఆర్ గార్డెన్, ఇతర టూరిజం ప్రాంతాలకు వెళ్లి చూసి రావచ్చు.
నగరంలోని కోరిన టూరిజం ప్రాంతంలో ఉదయం వదిలిపెట్టి, సందర్శన తర్వాత సాయంత్రం తిరిగి బస్సులో జిల్లాకు తీసుకురానున్నారు. ఇందుకు అదనపు చార్జీలను వసూలు చేయకుండా ఆర్టీసీ బస్సు సాధారణ చార్జీలే వసూలు చేయాలన్నది ఉన్నతాధికారుల యోచన. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకునేలా టీఎస్ ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘అనంతగిరిగుట్ట దర్శిని’ పేరిట ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి అనంతగిరి వరకు ప్రత్యేక బస్సు సర్వీసును ఆర్టీసీ నడిపిస్తున్నది.
పరిగి, జూలై 1: టీఎస్ ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతోపాటు పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నది. ఇప్పటికే ‘అనంతగిరి దర్శిని’ పేరిట హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి వరకు ప్రత్యేక సర్వీసును నడిపిస్తున్న ఆర్టీసీ… దర్శనీయ ప్రాంతాలకు బస్సులను నడిపించాలని భావిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, తాండూరుల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి.
పరిగి డిపోలో 74 బస్సులుండగా ఏప్రిల్లో ఆక్యుపెన్సీ రేషియో 75 ఉండగా… మే నెలలో 77కు చేరిం ది. అదేవిధంగా తాండూరు డిపోలో 90 బస్సులుండగా ఏప్రిల్లో 71గా ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రేషియో మే నెలలో 76 వరకు చేరుకోగా… వికారాబాద్ డిపోలో 74 బస్సు సర్వీసులుండగా ఏప్రిల్లో 69 ఉన్నటువంటి ఆక్యుపెన్సీరేషియో మే నెలలో 75 కు చేరింది. జిల్లాలోని ఈ డిపోల్లోని బస్సులు ప్రతిరోజూ సుమారు 30వేల పైచిలుకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నాయి. పరిగి డిపో ప్రతిరోజూ సుమారు రూ.10.5లక్షలు, తాండూ రు డిపో రూ.10 లక్షలు, వికారాబాద్ డిపో రూ.8 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాయి. మూ డు డిపోల పరిధిలో ప్రయాణికుల తరలింపు ప్రక్రియను పెంచేందుకు సంస్థ కృషి చేస్తున్నది.
వికారాబాద్ డివిజన్ పరిధిలోని మూడు డిపోల నుంచి హైదరాబాద్లోని పలు పర్యాటక ప్రాంతాలను ప్రజలు దర్శించేందుకు వీలుగా ‘హైదరాబాద్ దర్శిని’ పేరిట ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులను తీసుకెళ్లి గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్, ఎన్టీఆర్ గార్డెన్, ఇతర పర్యాటక ప్రాంతాలను తిలకించే సౌకర్యాన్ని సంస్థ కల్పించనున్నది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో 45 మంది, ఆర్డినరీ బస్సుల్లో 55 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంటుంది. బస్సు సీట్ల కెపాసిటీకి సరిపడా ప్రయాణికులు సిద్ధమై కోరిన సంబంధిత ప్రాంతం నుంచి హైదరాబాద్లోని సందర్శనీయ ప్రాంతాల్లో ఉదయం దింపి.. వారి సందర్శన పూర్తైన తర్వాత సాయంత్రం సమయంలో తిరిగి వారిని గమ్యస్థానాలకు చేరవేస్తారు. ఇందుకు సాధారణ చార్జీలనే వసూలు చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రయాణికులపై భారం పడకుండా.. మరోవైపు బస్సు సర్వీసులను సరైన విధంగా ఉపయోగించి సంస్థకు ఆదాయాన్ని అందించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలోని టూరిజం స్థలాలకు ప్రత్యేక బస్సులను నడిపించే అంశంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరం జిల్లాకు వంద కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ అక్కడ ఉన్న అనేక సందర్శనీయ స్థలాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా వెళ్లాలి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు హైదరాబాద్లోని పలు ప్రాంతాలను తిలకించాలని ఉన్నప్పటికీ వారు వెళ్లలేకపోతున్నారు.
విహార యాత్రలు పూర్తిగా తగ్గిపోయా యి. కేవలం పాఠ్య పుస్తకాల్లో సంబంధిత దర్శనీయ, టూరిజం ప్రాంతాల విషయం చవడం తప్ప చూడని వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి చక్కటి అవకాశం కల్పిస్తూ ఆర్టీసీ ప్రత్యేకంగా ఈ బస్సు సర్వీసులను నడిపేందుకు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ‘అనంతగిరిగుట్ట దర్శిని’ పేరిట ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి అనంతగిరి వరకు ప్రత్యేక బస్సు సర్వీసు నడుస్తున్నది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ నుంచి ఈ బస్సు బయలుదేరి అనంతగిరి, కోట్పల్లి ప్రాజెక్టు, బుగ్గ రామలింగేశ్వరాలయ సందర్శన తర్వాత సాయంత్రం తిరిగి కేపీహెచ్బీకి చేరుకుని ప్రయాణికులను అక్కడ చేర వేస్తున్నది. ఈ సర్వీసుపై ప్రజల్లో ఆదరణ పెరుగడంతో ప్రతి వారం సందర్శకులు ఆర్టీసీ బస్సులో అనంతగిరికి వచ్చి సందర్శనీయ ప్రాంతాలను తిలకిస్తున్నారు.
వికారాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ‘హైదరాబాద్ దర్శిని’ పేరిట హైదరాబాద్లోని టూరిజం స్థలాల సందర్శనకు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. బస్సు సీట్ల కెపాసిటీ మే రకు ప్రయాణికులు సిద్ధమై నగరంలోని ఎంపిక చేసిన పర్యాటక స్థలాలకు వెళ్లాలనుకుంటే వారి కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తాం.
ఉద యం సంబంధిత పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ దింపి.. సాయంత్రం తిరిగి వారిని గమ్యస్థానానికి చేరవేస్తాం. ఈ విషయమై జిల్లా వ్యా ప్తంగా అన్ని విద్యాసంస్థలు, గ్రామాల్లో కరపత్రా ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నాం.
-జ్యోతి, డివిజినల్ మేనేజర్, టీఎస్ ఆర్టీసీ