అన్నదాతలకు చేదోడువాదోడుగా నిలుస్తూ శ్రీ రామలింగేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఉత్తమ సేవలను అందిస్తున్నది. 2020లో ప్రభుత్వం అందించిన రూ.27లక్షల సబ్సిడీతో పాటు రూ.27,35,298 బ్యాంకు రుణం తీసుకుని 16 రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేసింది. మార్కెట్ ధర కంటే 10 శాతం తక్కువ ధరకు యంత్ర పరికరాలను రైతులకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నది. ఉత్తమ సేవలు అందించడంతోపాటు మంచి ఆదాయం పొందినందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్ సీఈవో, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి కులకచర్ల శ్రీ రామలింగేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ రాష్ట్ర స్థాయిలో అవార్డును దక్కించుకున్నది.
పరిగి, జూన్ 24: అవకాశం వస్తే ఏ రంగంలోనైనా రాణిస్తామని నిరూపిస్తున్నారు వికారాబాద్ జిల్లాలోని కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ మహిళలు. ఈ సంస్థ రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇస్తూ చక్కటి ఆదాయాన్ని పొందుతున్నది. రాష్ట్ర స్థాయిలోనే అవార్డును పొంది ఉత్తమ ఎఫ్పీవోగా కొనసాగుతున్నది. 2018 ఆగస్టు 8న కులకచర్లలో శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల మహి ళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటైంది. ఇందులో కులకచర్ల మండలంలోని 30 గ్రామాల్లో మొ త్తం 2,025 మంది సభ్యురాళ్లు ఉన్నారు. సంస్థ ఏర్పాటైన కొ ద్ది కాలంలోనే వివిధ రంగాల్లో విశేషమైన సేవలను అందిస్తూ రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ ఎఫ్పీవోగా ఎదిగింది. ఎఫ్పీవో పరిధిలోని 128 రైతు సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.50 వేల చొప్పున సీడ్ ఫండ్ను అందజేయగా వాటితో నాగళ్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేశాయి. శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం(సీహెచ్సీ) ద్వా రా వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని పొందుతున్నది.
శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని 2020 అక్టోబర్ 23న ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా రూ.53,35,298 ఖర్చు చేసి 16 రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేశారు. ఇందులో రూ.27లక్షలు సబ్సిడీ రూ పం లో ప్రభుత్వం అందజేయగా మిగతా రూ.27,35,298 బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్నారు. ఇందులో హార్వెస్టర్, సీడ్, ఫర్టిలైజర్, ట్రాక్టర్తో మందులను పిచికారీ చేసే యంత్రం, కల్టివేటర్, మినీట్రాలీ, ట్రాలీ, మినీట్రాక్టర్ తదితర యంత్ర పరికరాలు కొనుగోలు చేశారు. సీహెచ్సీ ఏర్పాటు తర్వాత ప్రత్యేకంగా హార్వెస్టర్, క్రాప్ కట్టర్ను కొన్నారు. ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను మార్కెట్ ధర కంటే 10 శాతం తక్కువ ధరకు రైతులకు అద్దెకు ఇస్తూ సంస్థ ఆదాయాన్ని పొందుతున్నది.
వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇవ్వడం ద్వారా 2020 అక్టోబర్ నుంచి 2022 మే వరకు రూ.16,37,735 ఆదాయం సమకూర్చింది. ఇందులో డీజిల్, ఆయిల్, వాహనాల రిజిస్ట్రేషన్, మరమ్మతులు, నిర్వహణ తదితర వాటికి దాదాపుగా రూ.7,61,768 ఖర్చు అయ్యాయి. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల డ్రైవర్లు, ఆపరేటర్ల వేతనాల కోసం రూ.4,13,092 చెల్లించడం జరిగింది. తద్వారా మొత్తం రూ. 11,74,860 ఖర్చయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని ఖర్చులు పో ను సీహెచ్సీకి రూ.4,62,875 ఆదాయం మిగిలింది. ఉత్తమ సేవలు అందించడంతోపాటు మంచి ఆదాయాన్ని పొందినందుకు రాష్ట్రస్థాయిలో సెర్ప్ సీఈవో, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నుంచి కులకచర్ల శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు అవార్డును అందుకున్నారు. ఈ మేరకు సంస్థ చైర్పర్సన్, కార్యవర్గంలోని వారిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు.
శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో కులకచర్ల మండలంలోని మామిడి రైతుల నుంచి పండ్లను కొనుగోలు చేసి ఎగుమతి చేయడంతోపాటు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చే కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. 2021లో కులకచర్ల ప్రాంతం నుంచి బేనిషాన్ సంస్థకు రూ.11,28,320 విలువ చేసే 51,540 కిలోల మామిడి కాయలను ఎగుమతి చేశారు. ఈ ఏడాది అనంతగిరి మ్యాంగోస్ బ్రాండ్నేమ్తో ఢిల్లీకి మా మిడిపండ్లను ఎగుమతి చేసిన సంస్థగా పేరు పొందింది. ఉద్యానవన శాఖ, సెర్ప్ సమన్వయంగా పనిచేసి ఈ సంస్థ ఆధ్వర్యంలో మామిడిపండ్లను ఎగుమతి చేయగా ఢిల్లీలోని తెలంగాణభవన్లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటుచేసి విక్రయించడం జరిగింది. మామిడిపండ్లు ఎగుమతి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. దీంతోపాటు రైతులకు అవసరమైన 423 విత్తనాల బస్తాలను మండలంలోని 203 మంది రైతులకు అందించారు. ఈసారి కూడా రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువులు అందించనున్నారు.
కులకచర్ల శ్రీరామలింగేశ్వర చిరుధాన్యా ల ఉత్పత్తిదారుల సంఘానికి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. తమ ఎఫ్పీవో అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. సీహెచ్సీ ద్వారా వివిధ రకాల వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతున్నది.
-శ్రీదేవి, రామలింగేశ్వర ఎఫ్పీవో కులకచర్ల
తమ ఎఫ్పీవో ద్వారా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సిరి ధాన్యాలను కొనుగోలు చేయడంతోపాటు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. ఎండాకాలంలో మామిడి కాయలను కొనుగోలు చేశాం.
-శోభ, ఏపీఎం కులకచర్ల