వికారాబాద్ : ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శనివారం వికారాబాద్లోని పలు ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వికారాబాద్ సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బుగ్గరామలింగేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ పూజలు చేశారు. ఆలయ ఆవరణలో భక్తులు సందడి చేశారు. సమీపంలోని నందిఘాట్ వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆనందంగా గడిపారు. పలువురు పర్యాటకులు నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులతో కలిసి కేకులు కట్ చేసి ఒకరికోకరు తినిపించుకున్నారు.
అటవీ అందాలను చూస్తూ ప్రకృతి ఒడిలో పర్యాటకులు గడిపారు. వికారాబాద్ మండల పరిధిలోని పులుసు మామిడి గ్రామ శివారులో ఉన్న పరమేశ్వరుడి గుట్టకు సమీప ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.