శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో నూతన దేవాలయాలను నిర్మించడం హర్షణీయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలం పిల్లిగుండ్లలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామస్తులు నూతన దేవాలయాలను నిర్మించడం సంతోషకరమన్నారు. దీంతో గ్రామాల్లో ఉన్న ప్రజల్లో భక్తిభావం పెరిగి సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. కాగా పిల్లిగుండ్ల గ్రామంలో ఈ నెల 24 నుంచి 29వరకు ఆంజనేయ, పోచమ్మ, ఎల్లమ్మల విగ్రహా ప్రతిష్ఠ జరిగాయి.
కాగా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్పల్లిలో భ్రమరాంబమల్లికార్జున, బీరప్పస్వామి విగ్రహాల ప్రతిష్ఠాప జరిగాయి. ఈ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పిల్లిగుండ్ల సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచ్ ధరణి ఐలయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్న శంకర్పల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బద్ధం శశిధర్రెడ్డి పాల్గొన్నారు.