షాద్నగర్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో లాటరీ పద్దతిన దరఖాస్తులను తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 18లోపు వైన్ షాపులకు దరఖాస్తు చేసుకున్నవారి జాబితను తయారు చేసి, లాటరీ ద్వారా షాపులను కేటాయించామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 234 మద్యం షాపులు ఉండగా సరూర్నగర్ డివిజన్లో 134 షాపులకు గాను 4102 దరఖాస్తులు వచ్చాయన్నారు.
శంషాబాద్ డివిజన్లో 100 మద్యం షాపులకు గాను 4137 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా షాపులను కేటాయించామని, సంబంధిత షాపులను లాటరీ పద్దతిలోనే కేటాయించామని చెప్పారు. లాటరీ పద్ధతిలో షాపులకు అనుమతులు పొందిన వ్యాపారులకు నియమాక పత్రాలను అందజేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మద్యం దుకాణల నిర్వహన కొనసాగించాలని వ్యాపారులకు సూచించారు. ఇందులో భాగంగానే శంషాబాద్ డివిజన్లోని 100 దుకాణాల కేటాయింపు ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి రాహూల్ బొజ్జా పర్యవేక్షించారు. లాటరీ పద్ధతిలో షాపులను పొందిన వారికి నియమాక పత్రాలను అందజేశారు.
షాపుల కేటాయింపు ప్రక్రియకు హాజరైన వ్యాపారులతో స్టేడియం ఆవరణ సందండిగా మారింది. పలు ప్రాంతాల మహిళలు సహితం షాపులను దక్కించుకునేందుకు పోటి పడ్డారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘునాథ్, జనార్దన్రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.