యాలాల : జగన్మాత ఎల్లమ్మ కృపతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో అనందంగా ఉండడమే కాకుండా నియోజకవర్గం సర్వం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్దాయిపేటలో వెలసిన ఎల్లమ్మ ఉత్సవాల్లో వారు ఇరువురూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుపొందిన జగన్మాత ఎల్లమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయన్నారు. దేవాలయం అభివృద్ధికి అన్ని విధాలుగా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని ముందుకు సాగుతున్నామన్నారు.
దేవాలయ ప్రాంగణంలో వాటర్ట్యాంక్ నిర్మిస్తామన్నారు. దేవాలయనికి కావలసిన కనీస వసతులను కల్పిస్తామన్నారు. ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ముద్దాయిపేట గ్రామానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని అమ్మవారిని కోరుతున్నామన్నారు. దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ శాశ్వత ధర్మకర్త ఎంపీటీసీ దేవగిరి రాములు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం జాతర ఉత్సవాలు ముగియనున్నాయని సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విటల్ నాయక్, ఎంపీపీ బాలేశ్వర గుప్తా, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుశోత్తమరావు, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచులు ఆకుల శివ, మధుసూదన రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న కమిటీ సభ్యులు వినోద్కుమార్, మాజీ సర్పంచ్ బిచ్చన్న గౌడ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.