షాద్నగర్రూరల్, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే మారుమూల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాలు, తండాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి. మారుమూల పల్లెలు, తండాలకు బీటీరోడ్డు నిర్మించడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది.
అభివృద్ధి పథంలో గ్రామాలు, తండాలు
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సర్కార్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో హరితహారం, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, ఇతర అభివృద్ధి పనులను విస్తృతంగా చేపట్టారు. దీంతో మండలంలోని 47 పంచాయతీలు,అనుబంధ గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులుకు ఆదేశాలు జారీచేశారు. దీనికి తోడు గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మరింత అభివృద్ధిని సాధిస్తాం
ఇప్పటికే మా గ్రామం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం తో అనేక అభివృద్ధి పనులు నిర్వహించాం. సర్కారు అత్యధిక నిధులు ఇస్తూ, గ్రామాల ప్రగతిని ప్రోత్సాహిస్తుండడం హర్షించదగ్గ విషయం. ఈ ప్రోత్సాహంతోనే మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. మలి విడుత పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతాం. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకరించడం ఆనందదాయకం.
– మౌనిక మచ్చేందర్, హాజిపల్లి సర్పంచ్,ఫరూఖ్నగర్ మండలం
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే మా గ్రామంలో పలు అభివృద్ది పనులు చేశాం. గ్రామభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులను భాగస్వాములు చేశాం. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. మలి విడుత పల్లె ప్రగతితో గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డు తదితర అభివృద్ధి పనులు నిర్వహించాం. ఈ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అందరి సహకారంతో గ్రామాన్ని మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
– జయశ్రీ చంద్రశేఖర్, సర్పంచ్, విఠ్యాల,ఫరూఖ్నగర్ మండలం
పల్లెప్రగతితో మరింత అభివృద్ధి సాధిస్తాం
తెలంగాణ సర్కార్ వచ్చాకే ప్రతి గ్రామం ఎంతో అభివృద్ధిని సాధించింది. మా గ్రామంలో గతంలో ఎప్పడూ లేనివిధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో అన్ని రంగాల్లో మా గ్రామం ప్రగతి సాధించింది. ఈసారి నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా ముందున్న లక్ష్యం. -సాయిప్రసాద్. ఎలికట్ట గ్రామ సర్పంచ్,ఫరూఖ్నగర్ మండలం
చాలా సంతోషంగా ఉంది
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. గత పల్లె ప్రగతి కార్యక్రమంలో మా గ్రామాన్ని మరింత సుందరంగా మార్చాను. జూలై 1 నుంచి మలి విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టి మా గ్రామానికి మరింత వన్నె తెస్తా. సర్కార్, అధికారులు, గ్రామస్తుల సహకారంతో మా గ్రామం ప్రగతి బాటలో సాగుతున్నది.
-బద్దుల శ్రీశైలం యాదవ్, కిషన్నగర్ సర్పంచ్, ఫరూఖ్నగర్ మండలం