మాడ్గుల, ఏప్రిల్ 26 : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో సోమవారం కనకాల చెరువు వద్ద చేపల క్రయవిక్రయాలతో సందడి నెలకొంది. జిల్లా మత్స్యశాఖ అధికారులు చెరువులో గతేడాది జూన్లో మూడు రకాల 4లక్షల చేప పిల్లలను వదిలారు. చెరువులో చేపలు బరువు పెరిగేందుకు ఎప్పటికప్పుడు ఫీడింగ్ అందజేశారు. ఎనిమిది నెలల కాలంలో ఒక్కొక్కటి 2.50 కిలోల నుంచి మూడు కిలోల బరువు పెరిగినట్లు మత్సకార సంఘం అధ్యక్షుడు బొల్లమోని లక్ష్మయ్య తెలిపారు. చెరువులో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపలు పడుతున్నామని హైదరాబాద్కు మూడు వాహనాల్లో 15 క్వింటాళ్ల చేపలను విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సంఘం తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నదన్నారు. చెరువు వద్ద చేపలు పడుతున్నారని గ్రామస్తులకు తెలియడంతో అనేక మంది వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్లారు.