షాద్నగర్టౌన్ మే 25: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని ఫరూఖ్నగర్ మండల జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి సూచించారు. షాద్నగర్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నాణ్యతతో ఉన్న ధాన్యానికి రూ. 1888మద్దతు ధర చెల్లిస్తారన్నారు. పలువురు రైతులు గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని కోరారు. విషయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు నిఖిల్రెడ్డి, హరికృష్ణ, నాయకులు లక్ష్మణ్నాయక్, రఘుమారెడ్డి పాల్గొన్నారు.
రైతువేదికల్లో ధాన్యం కొనుగోలు
ధాన్యం కొనుగోలు కోసం రైతువేదికలు వినియోగించుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్దార్నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొన్న స్వప్నానర్సింహారెడ్డి, మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల రైతాంగం పండించిన 4వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా 17వేల క్వింటాళ్లు ఇప్పటికే కొనుగోలు చేశామన్నారు. రైతులు ధాన్యం తీసుకొచ్చేందుకు మరో 7వేల గన్నీ బ్యాగులు పంపిణీ చేసినట్లు వివరించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన 30 వేల గన్నీ బ్యాగుల కోసం తాసీల్దార్ అమరలింగంగౌడ్తో ఫోన్ ద్వారా సంప్రదించారు. ఈ నేపథ్యంలో తాసీల్దార్ ఉన్నాతాధికారులతో చర్చించి అవసరమైన గన్నీ బ్యాగుల అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డులో ఉన్న గోదాంలు సరిపోకపోతే మండలంలోని కక్కులూర్, తాళ్లపల్లి, షాబాద్ తదితర ప్రాంతాల్లోని రైతువేదికలను గోదాంలుగా మార్చి వాటికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ ధాన్యం నిల్వకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పీసరి ప్రభాకర్రెడ్డి, నర్సింహారెడ్డి, మధు ఉన్నారు