రైతుల తోటల దగ్గరకు వెళ్లి మామిడికాయలు కోయించి అక్కడే తూకం వేసి కొనుగోలు చేయడం ద్వారా రైతుకు మేలు చేకూర్చాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశం. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ద్వారా మామిడికాయల కొనుగోలుకు నిర్ణయించింది. గతేడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించగా ఈసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి అధికారులు ప్రణాళికా సిద్ధం చేస్తున్నారు. ఇటు ఉద్యానవన శాఖ అధికారులు, అటు సెర్ప్ సిబ్బంది సహకారంతో మామిడికాయల కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. చిన్న, సన్నకారు రైతుల నుంచే మామిడికాయలు కొనుగోలు చేయడం ద్వారా గిట్టుబాటు ధర లభించేలా చూడనున్నారు. ఈ ఏడాది 102 మంది రైతుల నుంచి 165 మెట్రిక్ టన్నుల మామిడికాయల కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించారు. మామిడికాయల కొనుగోలుకు సంబంధించి బుధవారం కలెక్టర్ పౌసుమి బసు కులకచర్లలో మామిడి రైతులు, శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
సన్న, చిన్నకారు రైతుల నుంచే కొనుగోలు..
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కేవలం కులకచర్ల మండలంలోనే రైతుల నుంచి మామిడికాయల కొనుగోలు చేపట్టనున్నారు. కులకచర్లలో శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ఉన్నది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండల పరిధిలో 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతుల నుంచే మామిడికాయలు కొనుగోలు చేస్తారు. పెద్ద రైతులు మామిడికాయలు బయటి మార్కెట్లో విక్రయించేందుకు పెద్ద వాహనాల్లో తీసుకెళ్తారు. సన్న, చిన్నకారు రైతులు తమ ఉత్పత్తిని మార్కెట్కు తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల 5 ఎకరాల లోపు రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘంలో మహిళా రైతులు తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. మహిళా రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. వారి దగ్గరే మామిడికాయలు కొనుగోలు చేస్తారు.
165 మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు లక్ష్యం..
కులకచర్ల మండలంలోని 102 మంది రైతుల నుంచి 165 మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ, సెర్ప్ సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ రైతు వద్ద ఎంత విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయనేది సర్వే నిర్వహించారు. మే నెల మొదటి వారం నుంచి మామిడికాయల కొనుగోలు ప్రారంభిస్తారు. ప్రతివారం పక్వానికి వచ్చిన మామిడికాయలను తెంపించి తోటలోనే తూకం వేయించి తీసుకుంటారు. పది రోజుల తర్వాత సదరు తోటలో పక్వానికి వచ్చిన పెద్ద కాయలు కోయించి కొనుగోలు చేస్తారు. తద్వారా ప్రతి రైతుకు సరైన ధర లభిస్తుంది. ఈ పద్ధతి జూన్ రెండో వారం వరకు కొనసాగుతుంది. మామిడి కాయలు కోయించడానికి 5 ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్లో 10 మంది ఉంటారు. ఈ సారి మామిడి ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులకు మూడు రకాల మేలు..
రైతుల నుంచి నేరుగా మామిడి కొనుగోలు చేయడంతో రైతాంగానికి మూడు రకాలుగా మేలు కలుగుతుంది. మామిడికాయలు తెంపడం, తూకం వేయడం, మార్కెట్కు తరలించడం వంటి చార్జీలు మిగులుతాయి. మార్కెట్లో ఇవ్వాల్సిన కమీషన్ ఉండదు. మామిడి రైతులు, బెనిషాన్ కంపెనీకి అనుసంధానంగా సిరిధాన్యాల ఉత్తత్తిదారుల సంఘం ఉంటుంది. ఇందుకుగాను వారికి కిలోకు ఒక రూపాయి చొప్పున కమీషన్ కంపెనీ అందజేస్తుంది. రైతులకు మంచి ధర లభించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు కమీషన్ రూపంలో ఆదాయం చేకూరుతుంది.