రంగారెడ్డి, మే 13, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తుండడంతోపాటు లాక్డౌన్ అమలులో ఉన్న దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ ఒక్కరూ కూడా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లా అంతటా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉచితంగా రేషన్ బియ్యంతోపాటు మిగిలిన ప్రైవేట్ స్కూళ్ల బోధన, బోధనేతర సిబ్బందికి 25 కిలోల బియ్యం, నగదు పంపిణీ చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. లాక్డౌన్లో భాగంగా ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలను మూసివేయగా.. లబ్ధిదారుల ఇంటివద్దకే పౌష్టికాహారం పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంగన్వాడీ నుంచి అందజేసే బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకుల పంపిణీని గ్రామ కమిటీల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయనున్నారు. లాక్డౌన్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఈనెల 16 నుంచి..
లాక్డౌన్తో నేరుగా లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి సరుకులను పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అంగన్వాడీ టీచర్, గ్రామ కార్యదర్శి, స్థానిక పోలీసులతో కూడిన కమిటీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించనున్నారు. ఇదివరకు సెలవు రోజుల్లో అంగన్వాడీ సరుకుల పంపిణీ ప్రక్రియ జరిగేది కాదు. అయితే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెలవు రోజుల్లోనూ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అధిక సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న గ్రామాల్లో ముగ్గురు చొప్పున అంగన్వాడీ కేంద్రాల వద్దకు పిలిచి ఇవ్వనున్నారు. తక్కువ సంఖ్యలో లబ్ధిదారులున్న గ్రామాల్లో నేరుగా ఇంటివద్దకే అందజేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి మొత్తం 1,25,792 మంది ఉన్నారు.
ఇందులో గర్భిణులు 14,897, బాలింతలు 13,022, చిన్నారులు(6 నెలల నుంచి ఏడాది) 14,777, ఏడాది నుంచి 3 ఏండ్ల పిల్లలు 52,173 మంది, 3 ఏండ్ల నుంచి 6 ఏండ్ల పిల్లలు 30,923 మంది ఉన్నారు. అయితే లాక్డౌన్ దృష్ట్యా ఈ నెలాఖరు వరకు సరిపడా సరుకులను జిల్లా సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచడంతోపాటు గర్భిణుల వివరాలను కూడా సేకరించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెలలో కాన్పు అయ్యే గర్భిణుల వివరాలను కూడా సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధం చేసింది. కాన్పు సమయం దగ్గరపడిన మహిళలను దవాఖానకి తరలించేందుకుగాను తేదీల ప్రకారం అంబులెన్సులను అందుబాటులో ఉంచే విధంగా వైద్యారోగ్యశాఖ అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేయనున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
లాక్డౌన్తో అంగన్వాడీ కేంద్రాలను మూసివేశాం. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నేరుగా ఇంటి వద్దకు సరుకులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్క లబ్ధిదారులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 16 నుంచి సరుకుల పంపిణీ చేపట్టనున్నాం.