షాద్నగర్ : కళ్లాల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ముందుగానే గోనే సంచులను పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలోనే షాద్నగర్ ప్రాంతం నుంచి వరి పంటను ఎక్కువగా పండిచడంతో జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే అధికారులకు, మిల్లర్లకు సూచించారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరిధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు.
షాద్నగర్ నియోజకవర్గంలో 20వేల మందికి పైగా రైతులు సుమారు 37వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారని చెప్పారు. దీంతో సుమారు 85వేల 438మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మార్కెట్కు వచ్చె అవకాశం ఉందనే విషయాన్ని అధికారులు గ్రహించాలని కోరారు. మన జిల్లాలోనే షాద్నగర్ నుంచి అధిక వరి ధాన్యం మార్కెట్కు వస్తుందన్నారు. రైతులకు అవసరమయ్యే గోనే సంచులను అందుబాటులో ఉంచాలని అధికారుల కు సూచించారు. 21లక్ష 35వేల 950గోనే సంచులు అవసరపడే అవకాశం ఉందన్నారు. ధాన్యం నిల్వలకు తగిన ఏర్పాట్లు చేయాలని, మార్కెట్ యార్డుల పరిధిలో ఉన్న గోదాంలతో పాటు ప్రైవేట్ గోదాంలను ఉపయోగించుకోవడంతో పాటు తాత్కలికంగా గోదాంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ రాజరత్నం, ఎఫ్సీఐ అధికారి రాజేందర్సింగ్, పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్లు బక్కన్నయాదవ్, మంజుల, అశోక్, దామోదర్ రెడ్డి, మిల్లర్ల అసోసియేషన్ సభ్యుడు కొట్ర రాజు, మండలాల ఏఓలు, పీఎసీఎస్ సీఈఓలు, మార్కెట్ శాఖ అధికారులు పాల్గొన్నారు.