నవాబుపేట, జూన్ 18: తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటల్లో ఆకుకూరలు, కూరగాయల సాగు ప్రధానమైనది. మండలంలోని ముబారక్పూర్ గ్రామంలోని ప్రజలు 80 శాతం వరకు ఆకుకూరలనే సాగు చేస్తున్నారు. ఎవ్వరూ కూడా ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటల్లోపే వారు తమ పొలాలకు చేరుకుని పాలకూర, తోటకూర, పుదీనా, మెంతికూర, పుంటికూర తదితర ఆకు కూరగాయలను తెంపి కట్టలుగా కట్టి హైదరాబాద్లోని పలు మార్కెట్లకు తరలించి లాభాలను పొందుతున్నారు. పాలకూర, తోటకూర, పుదీనా పంటలను సాగు చేసే ముందు భూమిని చదునుగా దున్ని పంటకు అనుకూలంగా సిద్ధం చేసుకుని విత్తనాలను చల్లాలి.. అప్పుడే ఆశించిన మేర రైతులకు లాభాలు వస్తాయి.
పుదీనా పంట వేసే ముందు..
ముందుగా నేలను బాగా దున్నిన తర్వాత మడులను కట్టి నీటిని అందించాలి. పుదీనా నారు వేయడానికి ముందు భూమిని మరోసారి దున్ని నాటువేయాలి. వేసిన నెల రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. కూలీల సహాయంతో పంటను కొస్తారు. కూలీలు పుదీనా కట్టలను రోజుకు వెయ్యి నుంచి నాలుగు వేల వరకు కడతారు. దీంతో వారికి వెయ్యి కట్టలు కడితే రూ.150 ఇస్తారు. నాలుగు వేల వరకు కట్టలను కట్టడంతో వారు ఆరు వందల వరకు సంపాదిస్తారు. పుదీనా సాగు చేసినప్పటి నుంచి దాదాపుగా రెండు నుంచి మూడేండ్ల వరకు పంట చేతికి వస్తుంది. దీంతో రైతులు లాభాలను ఆర్జిస్తూ కూలీలకు కూడా ఉపాధిని కల్పిస్తున్నారు. పంట వేసిన 30-40 రోజుల్లోనే కోతకు వస్తుంది.. కోసిన వెంటనే మళ్లీ పదిహేను రోజుల తర్వాత పెద్దగా పెరిగి కోసేందుకు వస్తుంది. ఇలా 15 రోజులకొకసారి కోతకు వస్తూనే ఉంటుంది. రైతు ఈ పంట సాగుకు పెట్టిన పెట్టుబడి మొదటి కోతలో వచ్చిన ఆదాయంతోనే తీరిపోతుంది. మిగిలిన పంట మొత్తం అతడికి రాబడే.
ఆకు కూరలతో అధిక లాభాలు
ఆకుకూరలతో అధిక లాభాలను సాధించొచ్చు. పంటను సాగు చేసేందుకు ఖర్చు లు కూడా తక్కువగానే అవుతాయి. పుదీనా పంటను ఒక్కసారి సాగు చేస్తే మూడేండ్ల వరకు పంట చేతికి వస్తుంది. పెట్టిన పెట్టుబడి మొదటి కోతతో వచ్చిన ఆదాయంతోనే తీరిపోతుంది. పుదీనా పంటను కోసేందుకు కూలీలను పెట్టి వారికి కూడా ఉపాధిని కల్పిస్తున్నాం.
– సుకుమార్, రైతు ముబారక్ పూర్ గ్రామం
పాలకూర, తోటకూర పండించే విధానం
పుదీనాను సాగు చేసినట్లుగానే పాలకూర, తోటకూరను పండిస్తారు. కాకపోతే పుదీనాను సాగు చేస్తే రెండు నుంచి మూడేండ్ల వరకు ఆ పంట ఉత్పత్తి వస్తూనే ఉంటుంది. కాగా పాలకూర, తోటకూర తదితర పంటలను ఒకేసారి సాగు చేసి.. ఒకేసారి కోస్తారు. ఈ పంటలు కూడా తక్కువ కాలంలోనే అధిక దిగుబడిని ఇస్తారు. పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువే.
గ్రామస్తులు ఆకుకూరలను సాగు చేస్తున్నారు
మా గ్రామంలోని రైతులంతా ఆకుకూరలు, కూరగాయలను అధికంగా సాగు చేస్తున్నారు. ఉదయమే పొలాలకు వెళ్లి పంటలను కోసి కట్టలుగా కట్టి హైదరాబా ద్లోని పలు మార్కెట్లకు తరలించి అధిక లాభాలను పొందుతున్నారు. రైతులు ఎక్కువగా పుదీనాను సాగు చేస్తున్నారు. దానితోపాటు తోటకూర, పాలకూర, మెంతికూరలను కూడా పండిస్తున్నారు. ఉపాధి హామీ పనులకు ఎవ్వరూ వెళ్లారు.
– చిట్టేపు బాలమణి, ముబారక్పూర్ గ్రామ సర్పంచ్