చేవెళ్ల టౌన్, జూన్ 18: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో రైతులు విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పలు రకాల కంపెనీలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్రచారాన్ని గ్రామాల్లో జోరుగా చేస్తుంటాయి. రైతులు మోసపోకుండా నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తు తం మార్కెట్లో కొన్ని ప్రైవేట్ కంపెనీలు రైతులను తమవైపు తిప్పుకొనేందుకు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తుంటాయి. రైతులు అప్రమత్తతతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే కొనుగోలు చేయాలి.
నేల స్వభావాన్ని బట్టి ..
నేల స్వభావాన్ని బట్టి పైరు ఎదుగుదల, చీడ పీడలు ఉంటాయి. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ఎరువులు, పురుగుల మందులను వాడితే మంచిదని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు..
వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విత్తనం కొనుగోలు బిల్లుపై నంబరు, విత్తనం రకం, కొనుగోలు తేదీ, డీలర్ల సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. గడువు దాటిన విత్తనాలు, వదులుగా ఉన్న ప్యా కెట్లు, చిరిగిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి వచ్చే ప్యాకెట్లను కొనుగోలు చేయొద్దు. బిల్లుపై విక్రయదారుడి పేరు, సంతకం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను నంబర్లు, తేదీ, రకం, పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదై ఉండాలి. కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం చేయించాలి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకే పురుగు మందులను కొనుగోలు చేసి.. వాటిని పిచికారీ చేసే సమయంలో తగిన మోతాదులో నీటిలో కలపాలి.
వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన షాపుల్లోనే ఎరు వులు, విత్తనాలను కొనుగోలు చేయాలి. గ్రామాల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి విత్తనాలు, ఎరువులను అమ్మితే కొనవద్దు. మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడులను సాధించాలి.
-రమాదేవి, చేవెళ్ల డివిజన్ ఏడీఏ