ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 7 : మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నది. ప్రతిఏటా వానకాలం ముందుగానే మూగజీవాలకు వ్యాధులు సోకకుండా నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నది. గొర్రెలు, మేకలకు సోకే వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న 7.50లక్షల గొర్రెలు, 2.80లక్షల మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 83టీంలను నియమించింది. ఈ టీంలు ప్రతిరోజూ 83గ్రామాల చొప్పున గొర్రెలు, మేకలకు నివారణ టీకాలను వేయనున్నారు. టీకాల పంపిణీ నేటినుంచి ప్రారంభమై ఈనెల 14వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప తెలిపారు. గొల్లకుర్మలు, రైతులు సొంతంగా కొనుగోలు చేసిన గొర్రెలు, మేకలతో పాటు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన గొర్రెలు, మేకలను వ్యాధుల నుంచి కాపాడేందుకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గ్రామాలకు వచ్చే అధికారులు రైతులు సహకరించి ఈ టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రతిరైతు తమ గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 83టీంలు..
గొర్రెలు, మేకలకు సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా నేటినుంచి జిల్లా వ్యాప్తంగా నట్టల నివారణ టీకాలను పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7.50లక్షల గొర్రెలు, 2.80లక్షల మేకలు మొత్తం 10.30లక్షల గొర్రెలు, మేకలకు నట్టల మందులను వేసేందుకు 83టీంలను ప్రభుత్వం నియమించింది. ఈ టీంలు ప్రతిరోజూ 83గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
నట్టల వ్యాప్తి..
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయంతో పాటు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడుతారు. మూగజీవాల్లో అంతర్ పరాన్న జీవులు నివారిస్తే వాటి పెరుగుదల వేగంగా సాగుతుంది. జలగలు, బద్దె పురుగులు, నత్తగుల్లలు ముఖ్యమైనవి. ఇవి కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు బాగాల్లో చేరి అక్కడే అంటిపెట్టుకుని రక్తాన్ని పీల్చటం వల్ల రక్తహీనతకు గురవుతాయి. తద్వారా రోగ నిరోధకశక్తి తగ్గిపోవడంతో బలహీనంగా మారి వ్యాధులకు గురవుతాయని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. గొర్రెలు నిల్వ ఉండే నీటిని తాగటం వలన జలగలు కడుపులోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బద్దె పురుగులు పచ్చిక బయళ్లతో గడ్డిని తినడం ద్వారా దానిపై ఉండేవి కడుపులోకి వెళ్లి వ్యాధులకు కారణమయ్యే అవకాశమున్నందున రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. రైతులు వానకాలంలో మూగజీవాలను అటవీప్రాంతాలకు తరలించే క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే వెంటనే నివారించవచ్చును.
వ్యాధి లక్షణాలు..
చర్మం గరుకుగా ఉంటుంది.
నివారణ చర్యలు..
పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏటా నట్టల నివారణ మందులను గొర్రెలు, మేకలకు అందజేస్తున్నందున వాటిని ప్రతి గొర్రె, మేకలకు తప్పనిసరిగా వేయించాలి. గొర్రెల పెంపకం దారులు ఈ సమయంలో జాగ్రత్తపడి మందులు వేస్తే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. జీవాలకు వ్యాధి సోకిన వెంటనే మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి సోకినప్పుడు యాంటిబయోటెక్ ఇంజక్షన్లు వైద్యాధికారుల సూచనల మేరకు ఇప్పించాలి. ముఖ్యంగా వ్యాధి సోకిన గొర్రెలను మందనుంచి వేరుచేసి ప్రత్యేకమైన పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. కాపరులు పశువైద్యాధికారుల సూచనలు, సలహాల మేరకు మందులను అందించాలి.
వైద్యాధికారులకు సహకరించాలి
గొర్రెలు, మేకలకు సోకే నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నేటినుంచి ప్రారంభం కానున్నది. నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి గ్రామాలకు వచ్చే అధికారులకు రైతులు, కాపరులు సహకరించాలి. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఈ టీకాలు వేయించటం ద్వారా గొర్రెలు, మేకలకు ఎంతో మేలు జరుగుతుంది. వర్షాకాలం ప్రారంభమవుతుందున రైతులు సరైన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యాధికారుల సలహాలు పాటించాలి.
– అంజిలప్ప, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి