శంకర్పల్లి, జూన్ 7 : అభివృద్ధిలో శంకర్పల్లి మున్సిపాలిటీ ముందు వరుసలో ఉంటుంది. అద్దంలా మెరిసే రోడ్లు, విధి దీపాలు, ఎటు చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, స్వచ్ఛ ఆటోలు, స్వచ్ఛ ట్రాక్టర్లతో గతానికి భిన్నంగా శంకర్పల్లి రూపురేఖలు మారిపోయాయి. సమైక్య రాష్ట్ర పాలనలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో ఉండేది. స్వరాష్ట్ర పాలనలో శంకర్పల్లి అభివృద్ధిలో దూసుకు పోతున్నది. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న శంకర్పల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధే నిదర్శనం. గతంలో శంకర్పల్లి నుంచి నగరానికి వెళ్లడానికి సింగిల్ లేన్ రోడ్డు మాత్రమే ఉండేది. సీఎం కేసీఆర్ పాలనలో గండిపేట నుంచి శంకర్పల్లి వరకు 4 లేన్ల రోడ్డు వేశారు. దీంతో శంకర్పల్లి మున్సిపాలిటీ, గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయి. హరితహారంలో భాగంగా 3 నర్సరీలను ఏర్పాటు చేసి 25వేల మొక్కలను పెంచుతున్నారు. కొత్త నర్సరీ కోసం ప్రతిపాదనలు పంపారు.
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
శంకర్పల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. అన్ని వార్డుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించాం. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తాం. మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తా. మున్సిపాలిటీ అభివృద్ధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మరింత అభివృద్ధికి పాటుపడుతా.
– సాత విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్