‘ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం సమగ్రాభివృద్ధి, మెరుగైన సేవలు అందిస్తున్నది.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు..’ అని శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. గురువారం వికారాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. వికారాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి పనులు స్ఫూర్తి దాయకమన్నారు. ప్రతి పల్లెకు ప్రభుత్వం రోడ్లను వేసిందన్నారు. జిల్లాలో రూ.21.34కోట్ల నిధులతో 97 రైతువేదికలను నిర్మించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతుబీమా కింద జిల్లాకు రూ.174.20 కోట్లు అందాయన్నారు. జిల్లాలో 35,268 మందికి ఆరోగ్య శ్రీ కింద సేవలందాయన్నారు. దళితబంధు పథకం కింద జిల్లాలోని 358 మందికి లబ్ధి చేకూరిందన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు.
పరిగి, జూన్ 2 : ఉద్యమ సమయంలో ఏ ఆశయం సాధించాలని తపించారో, స్వరాష్ట్రంలో ఏ స్వప్నాలు ఫలించాలని ఆశించారో నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎనిమిదేండ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు తెలిపారు. తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గురువారం వికారాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కంటి వెలుగు, దళితబంధు, విద్యార్థులందరికీ సన్నబియ్యంతో కూడిన భోజనం వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు.
రైతుబంధు సాయం..
2018 నుంచి 2022 వరకు రైతుబంధు కింద 16,04,615 మంది రైతులకు రూ.2,018కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతుబీమా కింద ఇప్పటివరకు జిల్లాలో 3,484 మంది క్లెయిమ్దారుల నామినీలకు రూ. 174.20కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. 2018 నుంచి 2022 వరకు జిల్లాలో లక్ష రూపాయలలోపు రుణం ఉన్న 38,438 మంది రైతులకు రెండు విడుతల్లో రూ.94.28లక్షలు మాఫీ చేశామన్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
వానకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా 59,104 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 19,480 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 99,464 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం కంది పంట దిగుబడిలో వికారాబాద్ జిల్లా నుంచే 44శాతం కంది పంట ఉత్పత్తి అవుతుందన్నారు.
వైద్య సేవలకు పెద్దపీట..
మాతా, శిశు సంక్షేమమే ధ్యేయంగా అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు ఇప్పటివరకు జిల్లాలో 32,140 అందజేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని సర్కారు దవాఖానల్లో 9111 ప్రసవాలు జరిగాయని, 17,137 మంది గర్భిణులకు సేవలు అందించినట్లు చెప్పారు. వికారాబాద్లో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 45,973 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 35,268 మందికి రూ.78.15లక్షల విలువ గల వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. కొవిడ్ నియంత్రణ కోసం జిల్లా పరిధిలో ఇప్పటివరకు అన్ని రకాల వయస్సుల వారికి మొదటి డోసు 10,29,335 మందికి, రెండో డోసు 9,00,427 మందికి, బూస్టర్ డోసు 6,281 మందికి టీకాలు వేశామన్నారు. శిశువుల ఆరోగ్య భద్రత దృష్ట్యా 15,642 మంది శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పేర్కొన్నారు.
పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం
సమగ్ర అభివృద్ధి, మెరుగైన సేవలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని 578 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం పనులు చేపట్టడానికి ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లోని పల్లె ప్రకృతి వనాల పెంపుదలలో భాగంగా 10.52లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. 2021-22లో హరితహారం కింద జిల్లాలో 40.25లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మించి 44.90లక్షల మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. అనంతగిరి అడవిలో 750 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఔషధ మొక్కలు కాపాడడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇంటింటికీ తాగునీటి సరఫరా..
మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 2598 కిలోమీటర్ల పొడవు పైప్లైన్లు, 69 మంచినీటి ట్యాంకులు పూర్తి చేసినట్లు తెలిపారు. 2,03,688 నల్లాలను బిగించి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పంటల సాగుపై అవగాహన..
జిల్లాలో రైతులకు పంటల సాగు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు రూ.21.34కోట్లు ఖర్చు చేసి 97 రైతువేదికల నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా..
జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధి కోసం 690 చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా కోటీ 14లక్షల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 618 మంది మత్స్యకారులకు రూ.కోటీ 85లక్షలు వివిధ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి ఇప్పించినట్లు చెప్పారు.
పింఛన్తో భరోసా..
సామాజిక భద్రత కోసం జిల్లాలో వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాల వారికి రూ.1336కోట్లు పింఛన్గా అందజేసినట్లు వివరించారు.
మహిళల అభ్యున్నతికి..
స్త్రీ నిధి ద్వారా 2016 నుంచి 2022 వరకు 47,330 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.216.90కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా 44,845 స్వయం సహాయక సంఘాలకు రూ.1297.42కోట్లు రుణాలు అందజేసి ఆర్థికంగా బలపడడానికి కృషి చేసినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.
కూలీలకు ఉపాధి, వీధి వ్యాపారులకు రుణాలు..
2021-22లో 2,13,270 మంది కూలీలకు 72.63లక్షల పనిదినాలు కల్పించినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా 6677 మంది వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున రూ.6.67కోట్లు రుణాలుగా అందించామన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం..
ఆరోగ్యలక్ష్మి ద్వారా 1106 అంగన్వాడీ కేంద్రాల్లో 68,268 మంది గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం కోసం పాలు, చక్కటి భోజనం అందిస్తున్నామని చెప్పారు.
బాలల పరిరక్షణ..
జిల్లాలోని గ్రామ బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో 212 బాల్య వివాహాలను ఆపడం జరిగిందని, ఆపరేషన్ స్మైల్ ద్వారా 100 మంది బాల కార్మికులను సంరక్షించామన్నారు.
కల్యాణలక్ష్మితో అండగా..
జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద 6165 మందికి రూ.62.33కోట్లు, షాదీ ముబారక్ కింద 932 మంది లబ్ధిదారులకు రూ.9.42కోట్లు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఉన్నత విద్యకు ఆర్థిక సాయం
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాలలో చదువుకోవడానికి 2021-22లో ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి రూ.40.12లక్షలు అందించామన్నారు. ముఖ్యమంత్రి ఓవర్సీస్ కింద ముగ్గురు మైనారిటీ విద్యార్థులు విదేశాలలో విద్యాభ్యాసం కోసం రూ.42.04లక్షలు ఆర్థిక సహాయం అందజేసినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.
దళితుల ఆర్థికాభివృద్ధి..
దళితబంధు పథకం కింద జిల్లాలో 358 మంది దళితులకు ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున వాహనాలు, పనిముట్లు తదితర సాధనాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు. వికారాబాద్లో రూ.1.10కోట్లతో గిరిజనుల సౌకర్యార్థం గిరిజన భవన్ నిర్మాణం చేపట్టామని చెప్పారు.
సర్కార్ బడికి సౌకర్యాల కల్పన..
మన ఊరు-మన బడి కింద మొదటి విడుతగా జిల్లాలో 371 పాఠశాలలను ఎంపిక చేయగా పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. డీఎంఎఫ్టీ ద్వారా 2017 నుంచి 2022 వరకు ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వాతావరణ కాలుష్య నివారణ, సుందరీకరణ, విద్యారంగంలో మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణం, మహిళలు, పిల్లల సంక్షేమం కోసం 1469 పనులు గుర్తించి రూ.82.64కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
రోడ్లకు ప్రాధాన్యం
జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద 904 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.31.10కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో 31 రోడ్ల నిర్మాణానికి రూ.38కోట్లు ఖర్చు చేశామన్నారు. 12 బీటీ రోడ్ల పనులకు రూ.50.10కోట్ల వ్యయంతో చేపట్టడం జరుగుతుందని నాలుగు పనులు పూర్తయ్యాయని అన్నారు.
భవనాల నిర్మాణం..
జిల్లాలో రూ.9.97కోట్లు వెచ్చించి 198 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. రూ.60.70కోట్లు వెచ్చించి వికారాబాద్లో సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవనం నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని, ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉందన్నారు. రూ.5.15కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్ కార్యాలయం భవనం నిర్మానం కొనసాగుతుందని అన్నారు.
గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు..
జిల్లాలో 578 గ్రామ పంచాయతీలకుగాను 249 గ్రామపంచాయతీల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి స్థలాలు గుర్తించడం, ప్రతి మండలానికి రెండు చొప్పున క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్మన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, ఏఎస్పీ రషీద్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి అధికారి కోటాజీ, జిల్లా మైనార్టీ శాఖ అధికారి సుధారాణి, డీఎస్వో రాజేశ్వర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమల, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.