మంచాల మే 19 : ఆరుతడి పంటల సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి సునంద అన్నారు. గురువారం మంచాల మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వేసవికాలంలో కూరగాయల పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూరగాయల పంటలకు తామరపురుగు వ్యాపించే అవకాశాలున్నందున వాటి నివారణకు ఫ్రిఫోనిల్ మందును పిచికారీ చేయాలని చెప్పారు.
పంటల మార్పిడిలో భాగంగా బీట్రూట్, క్యారెట్, ఉల్లి పంటలను సాగుచేసుకొని అధిక దిగుబడితో పాటు లాభాల పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ సత్యనారాయణ, ఎంపీపీ జాటోతు నర్మద, సర్పంచ్ జగన్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ, జిల్లా రైతు బంధు జిల్లా సభ్యుడు పల్లె జంగారెడ్డి, పాల్గొన్నారు.