పెద్దఅంబర్పేట, జూలై 21 : ప్రేమ పెండ్లికి పెద్దలు అడ్డుపడుతారనుకున్నారా? ఏడడుగులు కలిసి నడువలేకపోతే కనీసం చావులోనైనా ఒక్కటవుదామనుకున్నారా? కారణం ఏమిటో తెలియదు కానీ, ఓ ప్రేమజంట బలవంతంగా ప్రాణాలు తీసుకున్నది. మూడ్రోజుల కిందట నిర్మానుష్యప్రదేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. అబ్దుల్లాపూర్మెట్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో రమాదేవి స్కూల్ వెనుకభాగంలో గుర్తుతెలియని యువతి, యువకుడి మృతదేహాలు పడిఉన్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ లభించిన బైక్ ఆధారంగా యువకుడిని సతీశ్ (25), యువతిని పూజ (23)గా పోలీసులు గుర్తించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మాల్ పోలేపల్లి గ్రామానికి చెందిన వీరిద్దరు ప్రేమికులని అనుమానిస్తున్నారు. బైక్పై నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్న ఈ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలంలో పురుగుల మందు బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమికులు మూడ్రోజుల కిందటే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. దుర్వాసన రాగా.. స్థానికులు గమనించడంతో విషయం బయటపడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించినట్టు సీఐ వాసం స్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.