రంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్త ల్లో ఎలాంటి నిజం లేదని, ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన పార్లమెంట్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు పని గట్టుకొని తనపై చేస్తున్న ఆరోపణలు, పుకార్లను దయచేసి నమ్మొద్దని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రధానంగా చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాలుకు బలమైన గాయం కావడంతోనే తాను ఇంటికే పరిమితమైనట్లు.. వైద్యుల సలహా మేరకు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాను ఇంట్లోనే ఉన్నా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మునుగోడు నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి ప్రభాకర్రెడ్డి విజయానికి కృషి చేయాలని సూచిస్తున్నట్లు చెప్పారు. మునుగోడు టీఆర్ ఎస్దేనని.. ఆ ఉప ఎన్నికలో కూసుకుంట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. స్వలాభం కోసం ఉప ఎన్నికకు కారణమైన వారిని మునుగోడు ప్రజలు నమ్మరన్నారు.