రంగారెడ్డి, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నేడు ఉమ్మడి జిల్లాలో ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు ఫ్రీడం రన్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడనున్నారు. అదేవిధంగా షాద్నగర్ పట్టణంలో 2కె రన్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, గురునానక్ కాలేజీ నుంచి ఇబ్రహీంపట్నం వరకు జరిగే 3కె రన్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, చేవెళ్ల పట్టణంలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొననున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఫ్రీడం రన్ నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 6.00 గంటలకు వికారాబాద్ పట్టణంలోని యెన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ క్రాస్రోడ్డు వరకు నిర్వహించే 2కె రన్లో ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ బాధ్యతలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి అప్పగించారు.