మోమిన్పేట, జూలై 17 : మండల పరిధిలోని చిన్న కొల్కుంద గ్రామంలో ఆషాఢమాసం సందర్భంగా గ్రామంలో పోచమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్ పాల్గొన్నారు. పోచమ్మ ఆలయం నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో భక్తులు యాటలు కోసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని పోచమ్మ అమ్మవారిని వేడుకున్నారు.
బొంరాస్పేట మండలంలో..
బొంరాస్పేట, జూలై 17 : మండలంలోని దేవులానాయక్తండా, బాపల్లితండా, బొట్లవానితండాతోపాటు ఇతర గిరిజన తండాల్లో ఆదివారం గిరిజనులు పసరు పండుగను(సీత్లా పండుగ) భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఉంచి తీపి వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించారు. మేకపోతులను బలిచ్చి ఆనందంగా పండుగ చేసుకున్నారు. వేడుకల్లో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నెహ్రూనాయక్, తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రవీందర్నాయక్ పాల్గొన్నారు.
పరిగిలో పూజలు చేసిన ఎమ్మెల్య్డే
పరిగి, జూలై 17 : పట్టణంలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై బెస్తవాడ, ఊరడమ్మగుడి, బహార్పేట్ మీదుగా మైసమ్మ ఆలయం వరకు కొనసాగింది. గంగపుత్రులు వలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి బోనాల ఊరేగింపు ముందు నడువగా సంబురాలు జరిగాయి. అనంతరం మైసమ్మ ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పట్టణంలోని మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, పూడూరు జడ్పీటీసీ మేఘమాల, పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్లు కిరణ్, రవీంద్ర, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్, శ్రీశైలం పాల్గొన్నారు.
గుండ్లమర్పల్లిలో..
మర్పల్లి, జూలై 16 : మండల పరిధిలోని గుండ్లమర్పల్లిలో మహిళలు బోనాలను పురవీధుల గుండా డోలు వాయిద్యాలు, శివసత్తులతో ఊరేగింపుగా తరలివెళ్లి దుర్గామాత, ఊరడమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కామునిపల్లిలో..
కులకచర్ల, జూలై 17 : మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో సర్పంచ్ పాల మహిపాల్రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో కట్టమైసమ్మతల్లికి బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామునిపల్లి గ్రామంతోపాటు ఇతర గ్రామాల ప్రజలు అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామునిపల్లి నుంచి కట్టమైసమ్మ ఆలయం వరకు ప్రజలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చందన, నాయకులు బాలకిష్టారెడ్డి, నర్సింహారెడ్డి, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.
కులకచర్ల మండలంలో..
కులకచర్ల మండల కేంద్రంలో పోచమ్మతల్లి బోనాల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనం చేసి ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు వెళ్లి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామానికి చెందిన పలువురు పోతరాజుల వేశధారణతో నృత్యాలు చేస్తూ డప్పువాయిద్యాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్ పాల్గొన్నారు.
కోట్పల్లి మండలంలో..
కోట్పల్లి, జూలై 17 : కోట్పల్లి, ఇందోల్ తదితర గ్రామాల్లో మహిళామణులు బోనం ఎత్తి గ్రామ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించారు.