ఇబ్రహీంపట్నం/షాద్నగర్టౌన్/ నందిగామ/షాబాద్/ మొయినాబాద్, జూలై 17: ఇబ్రహీంపట్నంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, మహిళా కౌన్సిలర్ శ్వేతతోపాటు అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. శివసత్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల కు ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.