షాద్నగర్, జూలై 13 : సైబారాబాద్ పరిధిలో నేరాలను పూర్తిస్థాయిలో అదుపుచేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. బుధవారం షాద్నగర్లో పోలీస్స్టేషన్ను తనిఖీచేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల నేరాలను అదుపు చేయడంతోపాటు నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేస్తామని తెలిపారు. జాతీయ రహదారి పొడవునా రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కఠినమైన చర్యలను తీసుకునేందుకు సిద్ధమయ్యామని, ఇందుకుగాను ఎస్ఐతో కూడిన వాహనంతో నిత్యం రహదారి పొడవునా పెట్రోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు, వాహనదారులు రోడ్డు ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత సిబ్బందితో సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ సేవలు పొందాలనుకునే ప్రజలు నేరుగా పోలీస్స్టేషన్లో తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సీఐ నవీన్కుమార్ పాల్గొన్నారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డితో కలిసి కేశంపేట, నందిగామ పోలీస్స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో కాసేపు మాట్లాడి వారి స్థితిగతులను, పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. నందిగామ నూతన పోలీస్ స్టేషన్ను ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పేర్కొనారు. కార్యక్రమంలో ఏసీపీ కుశల్కర్, కొత్తూర్ రూరల్, నందిగామ సీఐలు సత్యనారాయణ, రామయ్య, ఎస్ఐ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.