వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరల్ ఫీవర్, డయేరియా వంటి కేసులు ఎక్కువగా నమోదయ్యే గ్రామాల్లో క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి సర్వే సైతం నిర్వహిస్తున్నది. వ్యాధుల నివారణకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఫీవర్ లక్షణాలున్న వారిని గుర్తించి మందులను అందజేస్తున్నారు. జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయో ఆ ప్రాంతాల్లో జిల్లాస్థాయి ర్యాపిడ్ టెస్ట్ బృందం పరీక్షలు చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీరు నిల్వ ఉండొద్దని, చెత్తా చెదారం లేకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో తగు చర్యలు చేపట్టారు. వర్షాలతో జిల్లాలో వైరల్ జ్వరాలతోపాటు డయేరియా కేసులు నమోదవుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ గుర్తించింది. వర్షాలతో సీజనల్ వ్యాధులు అధికమయ్యే అవకాశమున్న దృష్ట్యా అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పారిశుధ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. వర్షపు నీరు నిలువకుండా గ్రామపంచాయతీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతోపాటు దోమల నివారణకు ప్రతి గ్రామంలో ఫాగ్ వేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా అన్ని మందులు అందుబాటులో ఉంచేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ప్రతి పీహెచ్సీకి ప్రత్యేక బృందం
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక ప్రత్యేక బృందాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక వైద్యుడు, ఆశా వర్కర్తోపాటు ఏఎన్ఎంలతో కూడిన బృందాన్ని నియమించారు. వైద్యారోగ్య శాఖ నియమించిన ప్రత్యేక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఫీవర్ లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమయ్యే మందులను అందజేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వైరల్ ఫీవర్, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. సంబంధిత గ్రామాల్లో కట్టడి చేసేందుకుగాను ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. కేసులు నమోదైన గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. పరిసరాల్లో ఇంటింటి సర్వే చేపట్టి ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు. జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ సీజనల్ వ్యాధులు ప్రబలుతాయో సంబంధిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి ర్యాపిడ్ బృందం జ్వరం, తదితర సీజనల్ వ్యాధుల లక్షణాలున్న వారికి స్థానికంగానే పరీక్షలు చేయనున్నారు. పరీక్షలతోపాటు ఫీవర్, డయేరియా వ్యాధులకు సంబంధించి మందులను కూడా ప్రత్యేక బృందాలు ఉచితంగా అందజేయనున్నారు. గ్రామపంచాయతీ సిబ్బందితోపాటు వైద్యారోగ్య శాఖ సిబ్బంది సీజనల్ వ్యాధులపై ప్రజలకు అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం లేకుండా, మురుగు కాల్వలు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.స్వరాజ్యలక్ష్మి
సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రతి పీహెచ్సీకి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కడైతే ఫీవర్, డయేరియా కేసులు నమోదవుతాయో, సంబంధిత ప్రాంతాల్లో వెంటనే క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టాం. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచాం.