ఇబ్రహీంపట్నం, జూలై 13 : నాలుగురోజులుగా కురుస్తున్న వర్షంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నిండుకుండలా మారింది. ఎగువప్రాంతాల్లో ఉన్న చెక్డ్యాంలు నిండి పెద్దకాల్వ, రాచకాల్వ ద్వారా ఇబ్రహీంపట్నం చెరువులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నీటిమట్టం 26అడుగులకు చేరింది. 42అడుగులు పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పదేండ్లలో మొట్టమొదటి సారిగా 26అడుగులకు చేరుకున్నది. దీంతో మత్స్యకారులు, ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దచెరువు ఎగువప్రాంతమైన ఆకులమైలారం, గుమ్మడవెల్లి, మాదాపూర్, ఎలిమినేడు, పోచారం ప్రాంతాల నుంచి వర్షంనీరు పెద్దకాల్వ ద్వారా ఇబ్రహీంపట్నం చెరువులోకి ప్రవేశిస్తుంది. పెద్దకాల్వలో నిర్మించిన చెక్డ్యాంలన్నీ నిండి మత్తడి దుకుంతున్నాయి.
చెరువు కింద 1250 హెక్టార్ల ఆయకట్టు..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కింద సుమారు 1250హెక్టార్ల ఆయకట్టు ఉంది. చెరువులో నీరుండటం వలన తూముల నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశాలు ఉండటంతో ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ చెరువుకింద ఇబ్రహీంపట్నం, శేరిగూడ, రాందాస్పల్లి తదితర గ్రామాల్లో ఆయకట్టు పొలాలున్నాయి.
మత్స్యకారుల హర్షం..
చెరువుపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ఇబ్రహీంపట్నం, శేరిగూడ గ్రామాలకు చెందిన గంగపుత్రులు, ముదిరాజులకు ఈ చెరువులో చేపలు పెంచుకునే హక్కు ఉంది. వారం రోజుల క్రితమే మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులోకి చేపలు వదిలారు.
త్వరలో చేపపిల్లలు వదులుతాం
ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను శాసించే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఈ ఏడాది ముందుగానే కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారుతోంది. ఈ చెరువు గత పదేళ్లుగా పూర్తిగా ఎండిపోయి ప్రజలు, రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత రెండేళ్లుగా కురుస్తున్న వర్షాలతో చెరువులోకి పుష్కలంగా నీరు వచ్చి చేరుతుంది. ప్రభుత్వ సహకారంతో చెరువును మరింత అభివృద్ధి చేయటంతో పాటు త్వరలో పెద్ద చెరువులో మరిన్ని చేపపిల్లలను వదిలేందుకు కృషిచేస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం