బొంరాస్పేట, జూలై 13: ఈ ఏడాది కొంచెం ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగానే కురు స్తున్నాయి. ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. వానకాలంలో మండలంలోని రైతులు చెరువులు, బోర్ల కింద ఎక్కువ విస్తీర్ణంలో వరి పంటను సాగు చేస్తారు. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో మండలంలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. దీంతో వాటి కింద రైతులు వానకాలంలో 18 వేలకు పైగా ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఇది జిల్లాలోనే అధికం. వర్షాలు అక్టోబర్ వరకు కురువడంతో వానకాలం పంటలకు నీటిని వాడుకున్నా చెరువులు నిండుగా ఉన్నాయి. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ ఏడాది యాసంగిలో రైతులు వరినాట్లు వేయలేదు. దీనివల్ల చాలా చెరువుల్లో నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. వానకాలంలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండ డం, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, బోర్లలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో ఈ ఏడాది కూడా వానకాలంలో రైతులు చెరువులు, కుంటలు, బోర్ల కింద వరి పంట సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతులు నారుమళ్లు పోసి పొలాలను చదును చేసుకుంటున్నారు. వరినాట్లు వేయడానికి జూలైతో పాటు, ఆగస్టు నెల రెండవ వారం వరకు అనుకూలంగా ఉంటుంది. ఎరువులు, విత్తనాల కొనుగోలు, పొలాలు దున్నడం వంటి పనుల్లో అన్న దాతలు బిజీగా ఉన్నారు.
ఈ ఏడాది 18 వేల ఎకరాల్లో వరి సాగు
మండలంలో ఈ ఏడాది వానకాలంలో కూడా 18 వేల ఎకరాల్లో వరినాట్లు వేసే అవ కాశం ఉందని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. చెరువులు, కుంటల కింద భూము లు వరి పంట సాగుకే అనుకూలంగా ఉండడంతో రైతులు వరినాట్ల వైపే మొగ్గు చూపుతారు. మండలంలో 12 నోటిఫైడ్ చెరువులు, వంద కుంటలు ఉన్నాయి. వీటికింద ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిగతాది బోర్ల కింద సాగవుతుంది. బొంరాస్పేట, మెట్ల కుం ట, బురాన్పూర్, కొత్తూరు, బురాన్పూర్ చిన్నవాగు ప్రాజెక్టు, చౌదర్పల్లి, దుద్యాలలోని చింతల్ చెరువు, గోపన్ చెరువులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మిగతా చెరువుల్లో కూడా వరిసాగుకు అవసరమయ్యేంత నీళ్లున్నాయి. వర్షాకాలం కావడంతో వరద నీరు వచ్చి చేరితే పంటలకు నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు.
అనుకూల వర్షపాతం
ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు ముందే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. జూన్ లో 68 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం మిల్లీ మీటర్లు ఉండగా 13వ తేదీ వరకు 44.8 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 231 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత ఏడాది కురిసిన వర్షాల తోనే బోర్లలో నీటి మట్టం ఏమాత్రం తగ్గలేదని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు మరింత పెరుగుతాయని, వరినాట్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.