మంచాల, జూలై 9 : రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే సదుద్దేశంతో క్లస్టర్కు ఒకటి చొప్పున రూ.22 లక్షలను కేటాయించి, మంచాల మండలంలోని ఆరుట్ల, బోడకొండ, మంచాల గ్రామంలో రైతు వేదికలను నిర్మించారు. ఈ వేదికల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ అధికారులు సాగు విధానాలు, పంటల విషయంలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వానకాలం సీజన్లో ఎలాంటి పంటలు వేయాలి… ఏ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి… ప్రభుత్వ పథకాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి… నకిలీ విత్తనాల కొనుగోలు చేసి మోసపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అన్న తదితర అంశాలపై అధికారులు రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా క్లస్టర్ పరిధిలోని ఏఈవోలు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో రైతువేదికల్లో సందడి నెలకొంటున్నది.
ఏ పంట వేస్తే లాభం..
వానకాలం సీజన్లో ఏ పంట వేస్తే అధిక లాభాలు వస్తాయన్న అంశంపై మంచాల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ ఆధ్వర్యంలో రైతులను చైతన్య పరుస్తున్నారు. పచ్చిరొట్ట ఆవశ్యకత, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఆధార్ అనుసంధానం, రైతుబీమా, రైతుబంధు, పత్తి, కంది ఇతర విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, బ్యాక్టీరియా ఉపయోగం, లాభాలు, ఎరువుల సమతుల్య వాడకం తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లైసెన్సు ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు, పురుగుల మందులను కొనుగోలు చేయాలని రైతులకు వివరిస్తున్నారు.
రైతులను చైతన్యపరుస్తున్నాం..
మంచాల క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల్లో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులను చైతన్యపరుస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణ తరగతులు నిర్వహించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– జ్యోతిశ్రీ, ఏఈవో