ఇబ్రహీంపట్నం, జూన్ 29 : ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా వద్ద రూ.6.30కోట్లతో గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాలతో పాటు బాలికల హాస్టల్ నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో నియోజకవర్గంలోని గిరిజన బాలబాలికలకు పూర్తిస్థాయిలో అత్యాధునిక హంగులతో ఈ భవన నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక హంగులతో తరగతి గదులతో పాటు వసతిగృహాలను నిర్మించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో నిర్మించిన ఈ భవనాలు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూ.4.20కోట్లతో బాలుర ఆశ్రమ పాఠశాల, కళాశాలలు నిర్మించారు. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠశాలతో పాటు వసతిగృహాన్ని కూడా కొనసాగించనున్నారు. ప్రస్తుతం యాచారంలో అద్దె భవనంలో కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాల కోసం ఇబ్రహీంపట్నంలో పక్కా భవనాన్ని నిర్మించారు.
ప్రస్తుతం యాచారంలో అద్దె భవనంలో కొనసాగుతున్న హైస్కూల్, కళాశాలను ఈ విద్యాసంవత్సరం నుంచి ఇబ్రహీంపట్నానికి మార్చనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన బాలురకు ఇందులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా వద్ద ఈ భవనాన్ని నిర్మించారు. అలాగే, రూ.2.15కోట్లతో ఈ భవనానికి సమీపంలోనే గిరిజన బాలికల వసతిగృహాన్ని కూడా నిర్మించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో అద్దె భవనంలో గిరిజన బాలికల వసతిగృహం కొనసాగుతుంది. ఈ వసతిగృహంలో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకునే గిరిజన బాలికల కోసం ఈ భవనాన్ని నిర్మించారు. ఇబ్రహీంపట్నంలోని వివిధ కళాశాలలతో పాటు ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న గిరిజన బాలికల కోసం ఈ వసతిగృహాన్ని నిర్మించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలో, పీజీ కళాశాలలో చదువుతున్న గిరిజన బాలికలకు ఈ కళాశాల ఎంతగానో ఉపయోగపడనున్నది. ఈ ప్రాంత గిరిజన విద్యార్థులకు ఈ భవన నిర్మాణాలు ఎంతగానో తోడ్పడనున్నాయి. ఎన్నో ఏండ్లుగా ఇబ్రహీంపట్నంలో గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాల ఏర్పాటు చేయాలంటూ ఈ ప్రాంతానికి చెందిన గిరిజన విద్యార్థులు కోరుతున్నారు. గిరిజన విద్యార్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో వీటిని నిర్మించారు.
ప్రభుత్వం ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా వద్ద నిర్మించిన గిరిజన పాఠశాల, కళాశాలలో అత్యాధునిక వసతులను కల్పించారు. ఈ ఆశ్రమ పాఠశాలలో చక్కటి తరగతి గదులు అత్యాధునిక వసతులతో మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించారు. ఇబ్రహీంపట్నానికి దూరంలో ఈ ఆశ్రమ పాఠశాలను నిర్మించారు. ఈ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే వారికి ఇందులోనే తరగతి గదులతో పాటు వసతిగృహం వసతి కూడా ఉన్నది. ఇప్పటివరకు ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాల యాచారం మండల కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్నది. వారి ఇబ్బందులను తొలిగించటానికి ప్రభుత్వం ఈ అత్యాధునిక వసతులతో కూడిన భవనం నిర్మించింది.
ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాల, వసతిగృహాల భవనాల్లో ప్రభుత్వం అత్యాధునిక వసతులు కల్పించింది. గిరిజన విద్యార్థినీ విద్యార్థులు వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంత విద్యార్థుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం నిర్మించింది.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే